వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 40.1 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, రొమారియో షెపర్డ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.


ఈ వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), శుభ్‌మన్ గిల్ (34: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు) భారత జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. వెస్టిండీస్ పేస్ బౌలర్ జేడెన్ సీల్స్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి శుభ్‌మన్ గిల్ టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడటం ప్రారంభించాడు. కైల్ మేయర్స్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్ ఇలా ప్రధాన బౌలర్లందరి బౌలింగ్‌లో బౌండరీలు సాధించాడు.


మోతీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ సింగిల్‌తో ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ సాధించాడు. అనంతరం అదే ఓవర్ ఐదో బంతికి శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేసిన మోతీ వెస్టిండీస్‌కు మొదటి వికెట్ అందించాడు. అక్కడి నుంచి భారత్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. తర్వాతి ఓవర్లోనే రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టాడు. భారీ షాట్ కొట్టబోయి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఆలిక్ అథనజ్‌ చేతికి చిక్కాడు.


ఆశ్చర్యకరంగా అక్షర్ పటేల్‌ను (1: 8 బంతుల్లో) టీమిండియా కీలకమైన సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దించింది. అక్షర్ పటేల్ రాణించలేకపోవడంతో భారత్ మూడో వికెట్ కూడా వెంటనే కోల్పోయింది. అనంతరం 24వ ఓవర్ ఆఖరి బంతికి హార్దిక్ పాండ్యా (7: 14 బంతుల్లో), 25వ ఓవర్ మొదటి బంతికి సంజు శామ్సన్ (9: 19 బంతుల్లో) అవుటయ్యారు. వెంటనే వర్షం పడటంతో ఆటకు అంతరాయం కలిగింది. అప్పటికి టీమిండియా 24.1 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 113 పరుగులు చేసింది.


ఆ తర్వాత ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించి రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. కానీ వీరు కూడా నాలుగు పరుగుల వ్యవధిలోనే అవుట్ కావడం, టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 40.1 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, రొమారియో షెపర్డ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. జేడెన్ సీల్స్, వై కరియాలు చెరో వికెట్ పడగొట్టారు.


వెస్టిండీస్ తుది జట్టు
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్