భారత్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 150 పరుగులు చేస్తే సరిపోతుంది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వారికి ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఓపెనర్ కైల్ మేయర్స్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. భారత ఏస్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒకే ఓవర్లో ఓపెనర్లు కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్‌లను అవుట్ చేశాడు. అప్పటికి స్కోరు 30 పరుగులు మాత్రమే.


ఫాంలో ఉన్న నికోలస్ పూరన్ మొదటి బంతి నుంచే విరుచుకుపడి ఆడటం ప్రారంభించాడు. కానీ మరో ఎండ్‌లో జాన్సన్ ఛార్లెస్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఛార్లెస్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం నికోలస్ పూరన్, కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు. ఇక్కడ రొవ్‌మన్ పావెల్ వేగంగా ఆడగా... పూరన్ తనకు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అనంతరం నికోలస్ పూరన్‌ను హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు.


డేంజరస్ బ్యాటర్ షిమ్రన్ హెట్‌మేయర్ ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. హెట్‌మేయర్, రొవ్‌మన్ పావెల్ ఇద్దరినీ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్లో అవుట్ చేసి విండీస్ భారీ స్కోరు ఆశలకు గండి కొట్టాడు. చివర్లో రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్ కావాల్సినంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులకు పరిమితం అయింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. భారత్ తరఫున ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ, ముకేష్ కుమార్ టీ20ల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు.


వెస్టిండీస్ తుది జట్టు
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్


భారత్ తుది జట్టు
శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్