IND vs SL 1st ODI:  శ్రీలంకతో టీ20 సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. లంకతో పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలు తిరిగి వన్డే జట్టులో చేరారు. వీరి రాకతో జట్టు బలంగా మారింది. అలాగే యువ ప్రతిభావంతులు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. గువాహటి వేదికగా మధ్యాహ్నం 1.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. 


హార్దిక్ పాండ్య నేతృత్వంలోని యువ భారత్ టీ20 సిరీస్ లో లంకను 2-1తో ఓడించింది. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. దీనికి సన్నాహకాలను ఈ సిరీస్ నుంచే ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాబట్టి పూర్తిస్థాయి జట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు జట్టుతో చేరారు. అలాగే మరో సీనియర్ మహ్మద్ షమీ కూడా వచ్చాడు. బుమ్రా కూడా మధ్యలో జట్టుకు ఎంపికైనప్పటికీ... పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవటంతో జట్టులో నుంచి తప్పించినట్లు నిన్న బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు కుర్రాళ్లు సత్తా చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు. 


తుది జట్టు ఏది?


శ్రీలంకతో తొలి వన్డే ఆడబోయే టీమిండియా తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. తనతో పాటు శుభ్ మన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడని కెప్టెన్ రోహిత్ శర్మ విలేకర్ల సమావేశంలో చెప్పాడు. అలా అయితే బంగ్లాతో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అతన్ని మిడిలార్డర్ లో ఆడించాలనుకుంటే కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టాలి. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ వస్తాడు. నాలుగో స్థానంలో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ ల మధ్య పోటీ ఉంది. టీ20ల్లో సూర్య వీరవిహారం చేస్తున్నాడు. ఇక శ్రేయస్ తనకు బాగా నప్పిన వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడు. మరి వీరిద్దరిలో తుదిజట్టులో ఎవరుంటారో చూడాలి. హార్దిక్, అక్షర్ లు ఆల్ రౌండ్ పాత్ర పోషించాల్సి ఉంది. 


బౌలింగ్ లో మహమ్మద్ షమీకు తోడుగా సిరాజ్ బరిలోకి దిగొచ్చు. మూడో పేసర్ గా అర్హదీప్ ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల అతని ప్రదర్శన గాడి తప్పింది. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ ను ఆడించినా ఆశ్చర్యం లేదు. ఇక స్పిన్ విభాగంలో చాహల్ కు కుల్దీప్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఉంది. ప్రస్తుతం చాహల్ ఫాం బాలేదు. ఈ నేపథ్యంలో కుల్దీప్ కు అవకాశం దక్కవచ్చు.


లంకతో జాగ్రత్తగా ఆడాల్సిందే


టీ20ల్లో శ్రీలంక మంచి ప్రదర్శన చేసింది. తొలి టీ20లో కేవలం 2 పరుగుల తేడాతో ఓడిన ఆ జట్టు.. రెండో మ్యాచ్ లో భారత్ షాక్ ఇచ్చింది. ఇక మూడో టీ20లో సూర్య సునామీలో ఆ జట్టు ప్రదర్శన ఎవరికీ కనపడలేదు. కాబట్టి వన్డేల్లోనూ లంకతో ముప్పు తప్పదు. కుశాల్ మెండిస్, అసలంక, షనక మంచి ఫాంలో ఉన్నారు. తీక్షణ, హసరంగ, చమిక కరుణరత్నే, మధుశంక, రజిత వంటి వారితో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. లంక లోయరార్డర్ లో పరుగులు చేయగలిగిన ఆటగాళ్లున్నారు. వీరితో టీమిండియా బౌలర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.


పిచ్ ఎలా ఉంది?


గువాహటి బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. ఈరోజు కూడా పరుగులు భారీగా వస్తాయనే అంచనా ఉంది. చలికాలం కాబట్టి మంచు ప్రభావం చూపవచ్చు. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 


ఎప్పుడు, ఎక్కడ చూడాలి


తొలి వన్డే గువాహటి వేదికగా మధ్యాహ్నం 1.30కు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. 


భారత తుది జట్టు (అంచనా)


రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, చాహల్ కుల్దీప్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్హదీప్ సింగ్ ఉమ్రాన్ మాలిక్. 


శ్రీలంక తుది జట్టు (అంచనా)


పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే.