దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20కి టీమిండియా సిద్ధం అవుతోంది. ఐదు టీ20 మ్యాచ్‌లు ఉన్న ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోతే సిరీస్ దక్షిణాఫ్రికా సొంతం అయినట్లే. కాబట్టి టీమిండియా ఈ మ్యాచ్ కోసం సర్వశక్తులూ ఒడ్డనుంది.


విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించింది. ఇవి రెండూ లో స్కోరింగ్ మ్యాచ్‌లే. అంతేకాకుండా రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కాబట్టి ఇక్కడ కూడా టాస్ కీలకం కానుంది.


ఈ స్టేడియం పూర్తి సామర్థ్యం 27,200 కాగా... అన్ని టికెట్లూ అమ్ముడుపోయినట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీడియా కో-ఆర్డినేటర్ మూర్తి తెలిపారు. ఒకవేళ వర్షం పడినప్పటికీ 20 నిమిషాల్లో మైదానాన్ని తిరిగి సిద్దం చేయగలమని పేర్కొన్నారు. తుదిజట్ల విషయంలో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశం ఉంది. అవేష్ ఖాన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు జట్టులో చోటు లభించవచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.


భారత్ తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్/అర్ష్‌దీప్ సింగ్


దక్షిణాఫ్రికా తుదిజట్టు (అంచనా)
తెంబా బవుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, డ్వేన్ ప్రిటోరియస్, రాసీ వాన్ డర్ డుసెన్, హెన్రిక్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, తబ్రయిజ్ షంసి