IND vs PAK: భారత్ -పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దానికి ఉండే క్రేజే వేరు. పనులు మానుకుని మరీ ఈ  మ్యాచ్‌ను చూసేందుకు ఇరు దేశాల్లో క్రికెట్ అభిమానులు అమితాసక్తితో వేచి చూస్తారు. ఫలితం  సంగతి పక్కనబెడితే ఇరు దేశాల మధ్య  మ్యాచ్ పంచే క్రికెట్ మజా    చాలాకాలం పాటు గుర్తుండుపోతుంది.  ఇక శనివారం  భారత్ - పాక్ మధ్య ఆసియా కప్ ‌లో భాగంగా  జరిగిన మ్యాచ్ కూడా  జరిగింది సగమే అయినా అభిమానులకు కావాల్సినంత మజాను అందజేసింది. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు పల్లెకెలె వెళ్లడానికి వీలులేని భారత క్రికెట్ అభిమానులు టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోయారు. 


వీకెండ్ కావడంతో  చాలామంది ఈ  మ్యాచ్‌ను తమ ఇండ్లల్లోనే ఉండి చూసేందుకు ఎంజాయ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి అయితే ఏకంగా  62 బిర్యానీలు ఆర్డర్ ఇచ్చాడు. అతడి ఆర్డర్ చూసి  ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ బిత్తరపోయింది.  ఈ విషయాన్ని స్విగ్గీ  స్వయంగా ఎక్స్ (ట్విటర్) వేదికగా  వెల్లడించింది. 


‘బెంగళూరు నుంచి ఓ వ్యక్తి  ఇప్పుడే 62 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. ఎవరండి మీరు..? మీ అడ్రస్ ఎక్కడ..?  మీరేమైనా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ పార్టీకి ఆతిథ్యమిస్తున్నారా..? మీరు ఏమనుకోకుంటే  నేనూ జాయిన్ కావొచ్చా..?’ అని ట్వీట్ చేసింది.  ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. 


స్విగ్గీ చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్లు  కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది  నెటిజన్లు.. ‘హా.. ఆ ఆర్డర్ ఇచ్చింది నేనే. త్వరగా మా ఇంటికి వచ్చేయ్. బిర్యానీలు మరిచిపోవద్దు’, ‘ఆ ఆర్డర్ నాదే,  నువ్వింకా రాలేదేంట్రా బాబు..’, అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


 






ఇక మ్యాచ్ మొదలై భారత టాపార్డర్ బ్యాటర్లు  పెవిలియన్‌‌కు క్యూ కడుతున్న తరుణంలో నెటిజన్లు దీనిని కూడా  ట్రోలింగ్‌కు వాడుకున్నారు. ‘అక్కడ ఒక్కడు కూడా నిలవడం లేదు. మీకు ఎలా తినబుద్ది అవుతుందిరా’ అంటూ తమ ఫ్రస్ట్రేషన్‌ను వెళ్లగక్కుతున్నారు. వర్షం వల్ల మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయిన వెంటనే ఓ యూజర్.. ‘హే వద్దు వద్దు.. ఆర్డర్ క్యాన్సిల్..’ అంటూ  మీమ్స్, ట్రోల్స్ చేశారు.  


 






 






భారత్ - పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  ఇండియా.. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), శుభ్‌‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయాస్ అయ్యర్ (14) దారుణంగా విఫలమయ్యారు.  కానీ ఇషాన్ కిషన్ (82), హార్ధిక్ పాండ్యా (87) పట్టుదలగా ఆడి భారత్‌కు పోరాడే స్కోరును అందించారు. అయితే భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత  మొదలైన వర్షం ఎంతకూ ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.  ఇరు జట్లకూ తలా ఓ పాయింట్ దక్కింది.  పాకిస్తాన్  సూపర్ - 4కు అర్హథ సాధించగా భారత్.. రేపు (సోమవారం) నేపాల్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.  


 






 



























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial