IRE 96 all out vs IND in New York:  టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup) తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. పసికూన ఐర్లాండ్‌(Ireland) బ్యాటర్లను వణికించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత(Team India) బౌలర్లను ఎదుర్కోవడం ఐర్లాండ్‌ బ్యాటర్ల వల్ల కాలేదు. పదునైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు... ఐర్లాండ్‌ను కేవలం 96 పరుగులకే కుప్పకూల్చారు. 16 ఓవర్లలోనే ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ ముగిసింది. టీ 20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లోనే భారత బౌలర్లు రాణించడంతో... ఇక మిగిలిన బాధ్యత బ్యాటర్లపై ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌  ఉన్న రోహిత్ సేన... ఈ స్వల్ప లక్ష్యాన్ని ఎంత త్వరగా ఛేదిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

టపాటపా కూలిన వికెట్లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా.. ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఐర్లాండ్‌ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా చేశారు. దీంతో ప్రతీ పరుగుకు ఐర్లాండ్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అర్ష్‌దీప్‌ ఐర్లాండ్‌ను తొలి దెబ్బ తీశాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. మూడో ఓవర్‌లో ఐర్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. పాల్ స్టిర్లింగ్‌ను అవుట్‌ చేసిన అర్ష్‌దీప్‌.. ఐర్లాండ్‌ పతనాన్ని ప్రారంభించాడు.  దీంతో ఏడు పరుగుల వద్ద ఐర్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం అదే ఓవర్‌ చివరి బంతికి బల్‌ బ్రిన్నీని అవుట్‌ చేశాడు. ఒకే ఓవర్‌లో అర్ష్‌దీప్‌ రెండు వికెట్లు తీయడంతో ఐర్లాండ్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా ఐర్లాండ్‌ వికెట్ల పతనం కొనసాగింది.

అనంతరం కాసేపు వికెట్ల పతనం ఆగింది. కానీ ఐర్లాండ్‌ స్కోరు  28 పరుగుల వద్ద ఉండగా ఐర్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. లాక్రన్‌ టక్కర్‌ను హార్దిక్‌ పాండ్యా బౌల్డ్‌ చేశాడు. టక్కర్‌ 13 బంతుల్లో పది పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత మరో ఎనిమిది పరుగులు స్కోరు బోర్డు మీదకు చేరగానే ఐర్లాండ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. హ్యారీ టెక్టర్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. పదహారు బంతులు ఆడిన టెక్టర్‌ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా ఐర్లాండ్‌ వికెట్ల పతనం వరుసగా కొనసాగింది. ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఏడుగురు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో టాప్‌ స్కోరు 26 పరుగులు కావడం గమనార్హం.

భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు తీసి ఐర్లాండ్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీయగా.... బుమ్రా కూడా రెండు వికెట్లు తీశాడు. సిరాజ్‌ ఒక్క వికెట్‌ తీయగా...అక్షర్ పటేల్‌ కూడా ఒక్క వికెట్‌ తీశాడు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వేళ  97 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఎన్ని ఓవర్లలో ఛేదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.