Jaiswal Became The 5th Indian To Score 600 Or More Runs In A Test Series: ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా(Team India) యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వీ 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ మినహా మరే బ్యాటర్ కనీసం 300 పరుగులు కూడా చేయలేదు. ఈ క్రమంలో ఓ టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన తొలి భారత ఎడమ చేతి బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ కూడా మూడు వందల పరుగులు చేశారు. 


సెహ్వాగ్‌ రికార్డు బద్దలు 
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భీకర ఫామ్‌లో వరుస శతకాలు సాధిస్తున్న యశస్వి జైస్వాల్‌.. మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.   
ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో 600పరుగులకుపైగా పరుగులు సాధించాడు. మూడో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ 12 సిక్సులు బాదేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సులు, 14 ఫోర్లు బాది డబుల్ సెంచరీతో వీర విహారం చేశాడు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో, ఈ క్యాలెండర్ ఇయర్‌లో 23 సిక్సులు బాదాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన టీమిండియా బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ వేసిన ఓవర్లో సిక్సు కొట్టడం ద్వారా జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సులు బాదాడు. తాజాగా 23 సిక్సులతో సెహ్వాగ్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లోనే జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. దీంతో ఈ ఏడాది జైస్వాల్ మరిన్ని సిక్సులు కొట్టనున్నాడు. 21 సిక్సులు కొట్టిన రిషబ్ పంత్, 20 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ, 18 సిక్సులు కొట్టిన మయాంక్ అగర్వాల్ ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు .



ఎదురీదుతోన్న టీమిండియా
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ కాగా... భారత జట్టు 219 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్‌ ధ్రువ్‌ జురెల్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిలబడకపోతే భారత్‌ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఓవర్‌ నైట్‌ స్కోరు  ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. జో రూట్‌ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు...ఆదిలోనే షాక్‌ తగిలింది. 4 పరుగుల వద్ద రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. జైస్వాల్‌ 73 పరుగులతో రాణించగా.. గిల్‌ 38, రజత్‌ పాటిదార్‌ 17, రవీంద్ర జడేజా 12, సర్ఫరాజ్‌ ఖాన్‌ 14, అశ్విన్‌ ఒక పరుగు  చేసి పెవిలియన్‌కుచేరారు. దీంతో 177 పరుగులకే భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా 200లోపే ఆలౌట్‌ అవుతుందని అంతా భావించినా కుల్‌దీప్‌ యాదవ్‌, ధ్రువ్‌ జురెల్‌ నిలబడ్డారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్‌ మరో వికెట్‌ పడకుండా 219 పరుగులు చేయగలిగింది. ప్రస్తుతం.. ఇంగ్లండ్‌ కంటే భారత్‌ ఇంకా 134 పరుగుల వెనుకంజలో ఉంది.