ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు (IND vs ENG Test)  కోసం కొంతమంది టీమ్‌ఇండియా ఆటగాళ్లు హైదరాబాద్‌(Hyderabad) చేరుకున్నారు. కుల్‌దీప్‌, జడేజా, యశస్వి, అశ్విన్‌, శుభ్‌మన్‌ గిల్‌ భాగ్యనగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ ఇక్కడే ఉన్నాడు. మిగిలిన భారత ఆటగాళ్లు, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు నేడు హైదరాబాద్‌ చేరుకుంటారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో గురువారం ఆరంభమవుతుంది. ఆదివారం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తారు. తాజ్‌ డెక్కన్‌లో ఇంగ్లాండ్‌, పార్క్‌ హయత్‌లో భారత ఆటగాళ్ల బసకు ఏర్పాట్లు చేశారు. 

 

పకడ్బంధీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఈనెల 25 నుంచి ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association) అధ్యక్షడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. హెచ్‌సీఏ కొత్త కార్యవ‌ర్గం ఎన్నికైన అనంతరం జరుగుతున్న తొలి క్రికెట్‌ మ్యాచ్ కావ‌డంతో దీనిని పండుగలా నిర్వహించేందుకు ఈసారి కొన్ని విప్ల‌వ‌వాత్మ‌క నిర్ణయాలు తీసుకున్నామ‌ని చెప్పారు.

 

టికెట్ల విక్రయం అంతా అన్‌లైనే

గ‌తంలో జింఖానాలో జ‌రిగిన తొక్కిస‌లాట దృష్ట్యా టిక్కెట్ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామ‌ని చెప్పారు. టెస్టు మ్యాచ్ అయినా స‌రే టికెట్ల కోసం అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించటం సంతోషకరమ‌న్నారు. స్టేడియం నలువైపులా పైకప్పు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలు, భారీ ఎల్‌ఈడీ తెరలు, ఆధునాతన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్ల సొబగులతో మైదానాన్ని టెస్టు మ్యాచ్‌కు ముస్తాబు చేశామ‌న్నారు. 

 

 శ్రీకర భరత్‌ అద్భుత శతకం

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అహ్మదాబాద్‌ వేదికగా ఇండియా ఎ – ఇంగ్లండ్‌ లయన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్‌ భరత్‌ సంచలన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్‌.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో  భరత్‌కు వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

 

కోహ్లీని రెచ్చగొడితేనే గెలుపట..!

ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో మైండ్‌ గేమ్స్‌ ఆడాలని, అతడి ఈగోపై దెబ్బ కొట్టాలని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌కు పనేసర్‌ సూచించాడు.

విరాట్‌తో మైండ్‌ గేమ్స్‌ ఆడాలని... అతడిని మానసికంగా దెబ్బతీయాలని పనేసర్‌ సూచించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ప్రత్యేకంగా విరాట్‌ కోహ్లీ మీదే దృష్టి సారించాలన్న పనేసర్‌... అతడి ఇగోతో ఆడుకోవాలని...కోహ్లీని స్లెడ్జ్‌ చేయడానికి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు మొహమాటపడాల్సిన అవసరమేమీ లేదని సూచించాడు. కోహ్లీ స్వదేశంలో ఆడుతున్నప్పుడు బీస్ట్‌ మోడ్‌లో ఉంటాడని... .అతడిని అవుట్‌ చేసేందుకు స్లెడ్జింగ్‌ మార్గమని అన్నాడు. పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదని.... ఫైనల్‌లో ఓడిపోయే చోకర్స్‌’ అని అరవాలని కూడా సూచించాడు.