Ind vs Eng Highlights: టీమిండియా (India)ప్రతీకారం తీర్చుకుంది. అది అలా ఇలా కాదు. 2022 ప్రపంచకప్‌లో తమకు ఎలా అయితే ఘోర పరాభవం ఎదురైందో... దానికి రెట్టింపుగా తిరిగి ఇచ్చేసింది. టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup) సెమీస్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేసి.. ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 171 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బ్రిటీష్‌ జట్టును కేవలం 103 పరుగులకే కుప్పకూల్చింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌(England)ను... స్పిన్నర్లు చుట్టేశారు. ఏ బంతిని ఎలా ఆడాలో తెలీక సతమతమయ్యారు. సుడులు తిరుగుతున్న భారత బౌలర్లను ఎదుర్కోవడం బ్రిటీష్‌ బౌలర్ల వల్ల కాలేదు. ఈ ఘన విజయంతో టీమిండియా టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లోకి పూర్తి ఆత్మ విశ్వాసంతో అడుగుపెట్టింది. ఇక మిగిలింది తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్‌ను ఘనంగా పైకి లేపడమే.


 

చతికిలపడ్డ ఇంగ్లాండ్‌ జట్టు

టీమిండియా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఆరంభంలో పర్వాలేదనిపించింది. ఓపెనర్లు జాస్‌ బట్లర్‌- ఫిల్ సాల్ట్‌ ఆరంభంలో బానే ఆడారు. టీమిండియా పేసర్లను ఎటాక్‌ చేస్తూ ధాటిగా పరుగులు రాబట్టారు. జాస్‌ బట్లర్‌ ఉన్నంతసేపు మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుందని అనిపించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు మూడు ఓవర్లలోనే 26 పరుగులు జోడించారు. ఇక్కడే అక్షర్‌ పటేల్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. నాలుగో ఓవర్‌లో బంతిని అందుకున్న అక్షర్‌ వేసిన తొలి బంతికే మంచి ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను అవుట్‌ చేశాడు. అక్షర్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడేందుకు బట్లర్‌ యత్నించగా... బ్యాట్‌ అంచును తాకుతూ  గాల్లోకి లేచింది. తేలికైన క్యాచ్‌ను కీపర్ పంత్‌ సునాయసంగా అందుకున్నాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ జట్టు పతనం వేగంగా సాగింది. బట్లర్‌ అవుటైన కాసేపటికే ఫిల్‌ సాల్ట్‌ కూడా అవుటయ్యాడు. సాల్ట్‌ను క్లీన్‌బౌల్ట్‌ చేసిన బుమ్రా... ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టాడు. 34 పరుగుల వద్ద బ్రిటీష్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్‌ పటేల్‌ ఓ మంచి బంతితో ప్రమాదకర 

ఆటగాడు బెయిర్‌ స్టోను బౌల్డ్‌ చేశాడు. 

 

కుల్‌దీప్‌ మాయాజాలం

అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ మాయాజాలం మొదలైంది. కుల్‌దీప్‌ను ఆడడం అసలు బ్రిటీష్ బ్యాటర్ల వల్ల కాలేదు. హ్యారి బ్రూక్‌ 25, జోఫ్రా ఆర్చర్‌ 21 పరుగులు చేశారు. బ్రూక్ చేసిన 25 పరుగులే ఇంగ్లాండ్‌ జట్టు అత్యధిక స్కోరు కావడం విశేషం. బ్రిటీష్‌ బ్యాటర్లలో ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కుల్‌దీప్‌ యాదవ్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. అక్షర్‌ పటేల్‌ కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. భారత బౌలర్ల విజృంభణతో బ్రిటీష్‌ జట్టు కేవలం 103 పరుగులకే కుప్పకూలింది.  దీంతో 68 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి 2022 టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.

 

భారత్‌ బ్యాటింగ్‌ సాగిందిలా... 
 కీలకమైన సెమీస్‌లో బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు  రాణించారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా ఇంగ్లాండ్ ముందు మంచి టార్గెట్‌ ఉంచారు. సారధి రోహిత్ శర్మ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్‌ 39 బంతుల్లో 6 ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటయ్యాడు.  సూర్య భాయ్‌ కూడా 36 బంతుల్లో 47 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరి భాగస్వామ్యం  టీమిండియాను పటిష్ట స్థానంలో నిలిపారు.  కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాదిన పాండ్యా 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. అక్షర్‌ పటేల్‌- రవీంద్ర జడేజా కూడా పర్వాలేదనించడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 171 పరుగులు చేసింది.