England team arrives in Hyderabad: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరేందుకు కీలకమైన టెస్ట్‌  సిరీస్‌లో భారత్‌తో తలపడేందుకు ఇంగ్లండ్‌ హైదరాబాద్‌ (Hyderabad) వచ్చేసింది. భారత్‌-ఇంగ్లండ్‌ (IND vs ENG Test) మధ్య తొలి టెస్ట్‌ ఈ గురువారం నుంచి జరగనుంది. అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు తర్వాత ఇంగ్లీష్ జట్టు నేరుగా హైదరాబాద్‌కు వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్లను చూడడానికి అభిమానులు ఎగబడగా ఆ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (England Cricket board)ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హలో హైదరాబాద్.. ఇది ముత్యాల నగరం అంటూ పోస్ట్‌కు కామెంట్‌ పెట్టింది.


భారత్‌, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుండగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లోని ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అబుదాబిలో దాదాపు నెల రోజుల క్యాంపు అనంతరం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా టెస్ట్ సిరీస్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించిన రోహిత్ సేన పట్టుదలగా ఉంది.


మరోవైపు   కొంతమంది టీమ్‌ఇండియా ఆటగాళ్లు హైదరాబాద్‌ చేరుకున్నారు. కుల్‌దీప్‌, జడేజా, యశస్వి, అశ్విన్‌, శుభ్‌మన్‌ గిల్‌ భాగ్యనగరానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ ఇక్కడే ఉన్నాడు. మిగిలిన భారత ఆటగాళ్లు, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు నేడు హైదరాబాద్‌ చేరుకుంటారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో గురువారం ఆరంభమవుతుంది. ఆదివారం నుంచి ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తారు. తాజ్‌ డెక్కన్‌లో ఇంగ్లాండ్‌, పార్క్‌ హయత్‌లో భారత ఆటగాళ్ల బసకు ఏర్పాట్లు చేశారు. 


కట్టుదిట్టమైన ఏర్పాట్లు


హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్‌ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణ‌లో ప‌ని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాల‌కు రిప‌బ్లిక్ డే రోజున ఉచితంగా అనుమ‌తించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఈనెల 25 నుంచి ఉప్పల్‌ స్టేడియంలో జరుగనున్న భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు మ్యాచ్‌కు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (Hyderabad Cricket Association) అధ్యక్షడు అర్శనపల్లి జగన్ ‌మోహన్‌రావు వెల్లడించారు. హెచ్‌సీఏ కొత్త కార్యవ‌ర్గం ఎన్నికైన అనంతరం జరుగుతున్న తొలి క్రికెట్‌ మ్యాచ్ కావ‌డంతో దీనిని పండుగలా నిర్వహించేందుకు ఈసారి కొన్ని విప్ల‌వ‌వాత్మ‌క నిర్ణయాలు తీసుకున్నామ‌ని చెప్పారు. 

 


టికెట్ల విక్రయం అంతా అన్‌లైనే

గ‌తంలో జింఖానాలో జ‌రిగిన తొక్కిస‌లాట దృష్ట్యా టిక్కెట్ల‌ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామ‌ని చెప్పారు. టెస్టు మ్యాచ్ అయినా స‌రే టికెట్ల కోసం అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించటం సంతోషకరమ‌న్నారు. స్టేడియం నలువైపులా పైకప్పు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలు, భారీ ఎల్‌ఈడీ తెరలు, ఆధునాతన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్ల సొబగులతో మైదానాన్ని టెస్టు మ్యాచ్‌కు ముస్తాబు చేశామ‌న్నారు.