ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో (12 బ్యాటింగ్: 47 బంతుల్లో, ఒక ఫోర్), బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్: నాలుగు బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 332 పరుగులు వెనకబడి ఉంది.


ఇన్నింగ్స్ మొదట్లోనే అలెక్స్ లీస్ వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఇప్పటివరకు క్రీజులోకి వచ్చిన వారిలో జో రూట్ (31: 67 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మాత్రమే 30 పరుగుల మార్కును దాటాడు. రెండంకెల స్కోరును చేరుకున్నది కూడా ముగ్గురు మాత్రమే.


ఓపెనర్ అలెక్స్ లీస్‌ను (6: 9 బంతుల్లో, ఒక ఫోర్) మూడో ఓవర్లోనే అవుట్ చేసిన బుమ్రా టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), ఓలీ పోప్ (10: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ రెండు వికెట్లను కూడా బుమ్రానే దక్కించుకున్నాడు దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసి టీ బ్రేక్‌ను ప్రకటించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యాక జో రూట్, జాక్ లీచ్ కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. భారత బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు దక్కగా... షమి, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.