లార్డ్స్ మైదానంలో భారత స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కొత్త రికార్డు సృష్టించాడు. ఈ గ్రౌండ్‌లో అత్యుత్తమ గణాంకాలు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తన 10 ఓవర్ల కోటాలో 47 పరుగులు ఇచ్చిన చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇక్కడ నాలుగు వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు. గతంలో భారతీయ బౌలర్లు ఎవరూ ఈ మైదానంలో మూడు వికెట్లకు మించి ఎక్కువ తీయలేదు.


జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వంటి కీలక వికెట్లను చాహల్ పడగొట్టడం విశేషం. చాహల్‌తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా రాణించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌట్ అయింది. 47 పరుగులు చేసిన మొయిన్ అలీనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


లార్డ్స్ మైదానంలో మూడు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మొహిందర్ అమర్‌నాథ్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్, మదన్ లాల్, యువరాజ్ సింగ్, ఆర్పీ సింగ్, జహీర్ ఖాన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇప్పుడు చాహల్ వాళ్లందరినీ అధిగమించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.