IND vs AUS Test:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు శుభవార్త. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ)లో పునరావాసం పొందిన బుమ్రా కోలుకున్నట్లు సమాచారం. బౌలింగ్ కూడా ప్రారంభించాడు. త్వరలోనే టెస్టు జట్టులో భాగం కానున్నాడు. అయితే చివరి రెండు టెస్టులకు మాత్రమే బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. 


భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. 'మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా జరగనుంది. అవును. బుమ్రా నెట్స్ లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను ఫిట్ గా ఉన్నాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది.' అని ఎన్ సీఏ అధికారి ఒకరు తెలిపారు. 


ఇంగ్లండ్ పర్యటన తర్వాత బుమ్రా వెన్ను గాయం గురించి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు, ఆసియా కప్ 2022 కు దూరమయ్యాడు. ఎన్ సీఏ పునరావాసం పొందిన తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే ఆ మ్యాచ్ మధ్యలోనే వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో టీ20 ప్రపంచకప్ నకు దూరమయ్యాడు. దాదాపు 5 నెలల పునరావాసం తర్వాత తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్ కు ఎంపికైనా.. మళ్లీ జట్టు నుంచి తొలగించారు. దీంతో మళ్లీ ఎన్ సీఏకు వెళ్లాడు. 


భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్


బోర్డర్- గావస్కర్ ట్రోఫీ భారత్, ఆస్ట్రేలియా ఇరు జట్లకు చాలా కీలకమైనది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు అర్హత సాధించేందుకు ఈ సిరీస్ ఇరు జట్లకు మంచి అవకాశం. కాబట్టి ఉత్కంఠభరిత పోరు ఖాయం. గత మూడుసార్లు జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. కాబట్టి ఆస్ట్రేలియన్లు ఈసారి మరింత పట్టుదలగా ఆడతారనడంలో సందేహంలేదు. 



ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత పర్యటన ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. టీమిండియా తర్వాతి 3 టెస్టు మ్యాచ్‌లు ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌లలో జరగనున్నాయి. 


ఎవరిది పైచేయి?


ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను వారి సొంత మైదానంలోనే ఏకపక్షంగా ఓడించింది. అదే సమయంలో ఉపఖండంలో ఈ జట్టు పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. దీనికి భిన్నంగా గత ఏడాది భారత జట్టు టెస్టు గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టెస్టుల్లో ఓడిన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై మాత్రమే విజయం సాధించగలిగింది.