కోట్ల మంది అభిమానుల ఆశలను మోసుకుంటూ... ముచ్చటగా మూడోసారి ఎలాగైనా విశ్వ సంగ్రామంలో ఛాంపియన్‌గా నిలవాలన్న లక్ష్యంతో.. టీమిండియా ఆదివారం (అక్టోబరు 8) ప్రపంచకప్‌ వేటను ప్రారంభించనుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో భీకరంగా ఉన్న భారత జట్టు.. అయిదుసార్లు ప్రపంచకప్ విజేత, కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే కీలకమైన తొలి మ్యాచ్‌కు ముందు భీకర ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ తొలి మ్యాచ్‌కు దూరం కావడం రోహిత్‌ సేనకు ప్రతికూలంగా మారింది. ఆసియా కప్‌లో వందకుపైగా పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించిన భారత్‌... ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.  విజయంతో టోర్నీని ప్రారంభించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందుకోసం రెండు జట్లు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. 

 హోరాహోరీ తప్పదా..? చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కానీ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ కఠినమైన ప్రత్యర్థే కావడంతో భారత్‌ తొలి పోరులో హోరాహోరీ తప్పక పోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు. చెపాక్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరమైన మ్యాచ్‌లు జరిగాయి. ఈసారి కూడా అలాంటి పోరు తప్పదని అభిమానులు అంచనా వేస్తున్నారు. భారత్ బ్యాటింగ్ బలంగా ఉంటే... ఆస్ట్రేలియా పేస్ అటాక్ అత్యున్నత స్థాయిలో ఉంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్‌లతో కంగారుల బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. బ్యాట్‌కు బాల్‌కు జరిగే ఈ పోరులో భారతే గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బుమ్రా సారధ్యంలో...బుమ్రా సారధ్యంలో భారత బౌలింగ్‌ కూడా బలంగా ఉంది. అశ్విన్‌కు తుది జట్టులో స్థానం దక్కవచ్చనే మాజీలు భావిస్తున్నారు. చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లుకు అనుకూలంగా ఉండడంతో..... అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. చెపాక్ పిచ్‌పై మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. సిరాజ్‌తో కలిసి బుమ్రా పేస్‌ విభాగాన్ని పంచుకోకున్నాడు. మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్‌ బ్యాటింగ్‌, బౌలింగ్  రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. ముగ్గుర స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెపాక్‌లో భారత్ 14 వన్డలు ఆడగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఆడిన ఆరు వన్డేల్లో ఐదింటిలో విజయం సాధించింది. 

భారత జట్టు:  రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ , శార్దూల్ ఠాకూర్. 

ఆస్ట్రేలియా జట్టు:  పాట్ కమిన్స్ (సి), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.