IND vs AUS 1st ODI: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు టెస్టులలో చుక్కలు చూపించిన భారత జట్టు ఇప్పుడు వన్డేలలో తలపడబోతోంది. ఆడేది సాధారణ వన్డే సిరీసే అయినా ఇరు జట్లూ ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బరిలోకి దిగుతున్నాయి. అదీగాక   జూన్ లో జరుగబోయే  ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)కు ముందు ఇరు జట్లు  (ఇప్పటికే ఫైనల్ చేరాయి) తలపడబోయే  సిరీస్ కావడంతో రెండు జట్లపైనా అంచనాలు భారీగా ఉన్నాయి.  వాంఖెడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుండటంతో  భారీ స్కోరింగ్ గేమ్ ను అభిమానులు ఎక్స్‌‌పెక్ట్ చేస్తున్నారు. 


కీలక ఆటగాళ్ల చేరిక.. దూరం.. 


శుక్రవారం నుంచి మొదలుకాబోయే ఈ సిరీస్ లో  రేపు  మధ్యాహ్నం వాంఖెడే వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ సిరీస్ కోసం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు భారత జట్టులోకి తిరిగివచ్చారు. అయితే  బామ్మర్ది పెళ్లి వల్ల రోహిత్ శర్మ తొలి వన్డేలో ఆడటం లేదు. అతడితో పాటు  మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా  వెన్నుగాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇది భారత జట్టుకు  కాస్త ఇబ్బందే.  రోహిత్ గైర్హాజరీలో  హార్ధిక్ పాండ్యా  సారథ్య పగ్గాలు చేపట్టనున్నాడు. అతడికి వన్డేలలో కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్.  రోహిత్, శ్రేయాస్  తప్ప దాదాపు  ప్రపంచకప్ కోర్ గ్రూప్ లో  ఉన్న  టీమ్ మెంబర్స్ తోనే భారత జట్టు బరిలోకి దిగుతోంది.  


ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే  తల్లి చనిపోవడంతో కమిన్స్ వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. అతడితో పాటు స్టార్ బౌలర్ జోష్ హెజిల్వుడ్, పేసర్  జై రిచర్డ్‌సన్ కూడా సిరీస్ కు దూరమయ్యారు.   కానీ కాలి గాయం కారణంగా నవంబర్ నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టుతో కలిశాడు. ఆడమ్ జంపా,  కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ లతో  ఆసీస్ బలంగా ఉంది.  


జట్టు కూర్పుపై దృష్టి.. 


గత కొన్నాళ్లుగా స్వదేశంలో  పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత్ దుర్బేధ్యంగా తయారైంది.  భారత్ ను ఓడించి సిరీస్ ను గెలుచుకోవడమంటే అది  అతిశయోక్తే. రోహిత్ సారథిగా అయ్యాక ఇది మరింత ఎక్కువైంది. ఈ ఏడాది కూడా జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ లపై భారత్ వన్డే సిరీస్ లను గెలుచుకుంది.  ఆసీస్ పైనా అదే ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తున్నది. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాడు.  


గిల్ తన ఫామ్ ను కొనసాగించాలని భారత్ కోరుకుంటున్నది.  తొలి వన్డేలో రోహిత్ గైర్హాజరీలో గిల్ కు తోడుగా ఇషాన్ కిషన్ రావొచ్చు.  విరాట్ కూడా  వన్డేలలో బాగానే ఆడుతున్నాడు.  శ్రేయాస్  దూరమైన నేపథ్యంలో మిడిలార్డర్ లో  సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకం. అతడితో పాటు రాహుల్,  పాండ్యా, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉంది.  బౌలింగ్ లో కూడా సిరాజ్ వన్డేలలో ఇరగదీస్తున్నాడు. అతడికి తోడుగా షమీ, ఉమ్రాన్ లలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరం.  స్పిన్నర్లలో కూడా చాహల్-కుల్దీప్ ల మధ్య  పోటీ నెలకొని ఉంది.  


ఆసీస్ కూడా బలంగానే.. 


కమిన్స్, హెజిల్వుడ్ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా  ఆసీస్ కూడా బలంగానే ఉంది.  డేవిడ్ వార్నర్ కు  వన్డేలలో భారత్ పై మంచి రికార్డు ఉంది. స్మిత్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ.. ఇలా  ఆ జట్టు  బ్యాటర్ల లిస్టు చాంతాడంత ఉంది.   పేస్ బాధ్యతలు స్టార్క్ తో పాటు గ్రీన్, స్టోయినిస్ మోయనున్నాడు.  ఆడమ్ జంపాను అడ్డుకోవడం భారత బ్యాటర్లకు అత్యావశ్యకం.   


మ్యాచ్ వివరాలు : 


ఎప్పుడు:   మార్చి 17 మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం.. 
ఎక్కడ : వాంఖెడే స్టేడియం, ముంబై   
చూడటమెలా..? : డిస్నీ హాట్ స్టార్, డీడీ స్పోర్ట్స్ లో లైవ్
వాతవారణం : ముంబైలో గురువారం కాస్త చిరుజల్లులు కురిశాయి. కానీ శుక్రవారం సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.