ICC Women's T20 World Cup Schedule 2024: ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌(Women T20 World cup) షెడ్యూల్‌ను ఐసీసీ(ICC) ప్రకటించింది. ఇందులో భారత్‌ కఠినమైన గ్రూప్‌ ఏలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌లతో కలిసి భారత్ గ్రూప్-ఏలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో భారత్ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్‌ వేదికగానే ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ వేట ప్రారంభించనున్న మహిళల జట్టు... అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

 

ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు 

అక్టోబర్ 9న క్వాలిఫయర్ 1 జట్టుతో భారత్‌ ఆడనుంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో అక్టోబర్ 13న భారత మహిళల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నమెంట్‌లో ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీ-ఫైనల్‌ ఆడతాయి. అక్టోబర్ 20న ఢాకాలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఢాకా, సిల్హెట్‌ వేదికగా ఈ టీ 20 ప్రపంచకప్‌లోని మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీ-ఫైనల్‌, ఫైనల్‌కు రిజర్వ్ రోజులు ఉంటాయని ICC తెలిపింది.


గ్రూప్‌-బిలో బంగ్లాదేశ్‌ , దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌ 2 ఉన్నాయి. అర్హత పోటీల్లో ఐర్లాండ్, యూఏఈ, శ్రీలంక, స్కాట్లాండ్‌లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీఫైనల్లో ఐర్లాండ్ స్కాట్లాండ్‌తో తలపడగా, రెండో సెమీఫైనల్లో యూఏఈ శ్రీలంకతో తలపడనుంది.

 

చురుగ్గా పురుషుల టీ 20 ప్రపంచకప్‌ ఏర్పాట్లు 

వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌(T20 world Cup)  కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఇప్పటికే విడుదల చేసిన ఐసీసీ(ICC)... ఇప్పుడు  ఈ మెగా టోర్నమెంట్‌ అధికారిక గీతాన్ని విడుదల చేసి క్రికెట్‌ ఫీవర్‌ను మరింత పెంచింది.  గ్రామీ అవార్డు విజేత సీన్‌ పాల్‌, సోకా సూపర్‌ స్టార్‌ కెస్‌ సంయుక్తంగా ‘అవుటాఫ్‌ దిస్‌ వరల్డ్‌’ పేరిట ఈ గీతాన్ని రూపొందించారు. మైఖేల్‌ టానో మొంటానో నిర్మాణంలో గీతం రూపొందింది.  టోర్నమెంట్‌కు ముప్పై రోజుల ముందు.. థీమ్ సాంగ్ విడుదలైంది. ఈ పురుషుల పోటీ ప్రపంచ కప్ టోర్నీలో 20 జట్లు 55 మ్యాచ్‌ల్లో పోటీపడ్డనున్నారు. 

 

టీ20 ప్రపంచకప్ 2024 ప్రచారకర్తగా జమైకన్ పరుగుల చిరుత, ఒంలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసెన్ బోల్ట్‌( Usain Bolt)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నియమించింది. అమెరికాలో క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఐసీసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో తన స్పీడ్‌తో ఒలింపిక్స్‌లో  8 సార్లు బంగారు పతకాలు సాధించిన జమైకా స్పీడ్‌స్టర్ ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించారు. బోల్డ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల, టీ20 వరల్డ్‌కప్‌ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు టోర్నీ నిర్వాహకులు.