Haris Rauf On Kohli:  గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ లో ఇంటిముఖం పట్టింది. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ టీమిండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ లీగ్ మ్యాచుల్లో అద్భుతంగా ఆడిన భారత్ కీలక మ్యాచులో చేతులెత్తేసింది. సూపర్- 12 స్టేజ్ లో 5 మ్యాచుల్లో 4 గెలిచిన టీమిండియా సగర్వంగా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. అయితే అక్కడ ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 


ఆ 2 సిక్సులు అద్భుతం


సూపర్- 12 స్టేజ్ మొదటి మ్యాచ్ లోనే టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ భారత్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో టీమిండియా తడబడింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసి పాక్ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన 2 సిక్సులు అందరినీ అబ్బురపరిచాయి. క్రికెట్ పండితులు, అభిమానులు ఆ సిక్సులపై ప్రశంసల వర్షం కురిపించాడు. దీనిపై తాజాగా పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ స్పందించాడు. విరాట్ కోహ్లీ మళ్లీ అలాంటి షాట్లు ఆడగలడని తాను అనుకోవడం లేదని రౌఫ్ అన్నాడు. 


మళ్లీ అలా కొట్టలేడు


ఆ మ్యాచులో విరాట్ కోహ్లీ, హారిస్ రౌఫ్ వేసిన 19 ఓవర్ చివరి 2 బంతులను స్టాండ్స్ లోకి తరలించాడు. మొదటి సిక్సను విరాట్ కొట్టిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ షాట్ పై పాకిస్థాన్ షో 'హస్నా మనా హై' లో అభిమాని అడిగినప్పుడు రౌఫ్ ఇలా స్పందించాడు. క్రికెట్ లో ఇలాంటి షాట్లు అరుదుగా ఉంటాయని.. నాకు తెలిసి విరాట్ కోహ్లీ మళ్లీ ఆ షాట్ ఆడలేడేమో అని వ్యాఖ్యానించాడు. 


'అవును. ఆ బంతి సిక్సర్ వెళ్లినప్పుడు నాకు బాధ కలిగింది. ఏదో తప్పు జరిగిందని అనుకున్నాను. క్రికెట్ గురించి తెలిసిన ఎవరికైనా విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో తెలుస్తుంది. అతను అప్పుడు ఆ షాట్ ఆడాడు. అయితే నాకు తెలిసి మళ్లీ అలా చేయగడలడని నేను అనుకోను. అలాంటి షాట్లు చాలా అరుదు. వాటిని మళ్లీ మళ్లీ కొట్టలేరు. అప్పుడు కోహ్లీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది, బంతి సిక్సర్ వెళ్లింది.' అని హారిస్ రౌఫ్ అన్నాడు. 


ప్రస్తుతం విరాట్ కోహ్లీ శ్రీలంకతో వన్డేల కోసం సిద్ధమవుతున్నాడు. టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ... వన్డే సిరీస్ కు జట్టులో చేరాడు. రేపు లంకతో మొదటి వన్డే జరగనుంది.