Baba Neem Karoli on Virat Kohli Phone Wallpaper: సన్మానాలు... పొగడ్తలు.. పార్టీలు... స్వాగతాలు... సంబరాలు.. ఇలా టీమిండియా ఆటగాళ్లు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లకు ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం లభిస్తోంది. వాంఖడేలో చరిత్రలో నిలిచిపోయే సన్మానం ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎవరి స్వస్థలలాకు వాళ్లు వెళ్లిపోయారు. ఈ టీ 20 ప్రపంచకప్‌తో పొట్టి క్రికెట్‌కు వీడ్కోలుకు పలికిన విరాట్‌ కోహ్లీ (Virat Kohli)... తన చివరి మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. టీమిండియా చేరిన తర్వాత కోహ్లీ. లండన్‌లో ఉన్న భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లను కలిసేందుకు అక్కడికి బయలుదేరాడు. అయితే లండన్‌ బయల్దేరే ముందు ఎయిర్‌పోర్ట్‌లో కోహ్లీ వీడియో వైరల్ అయ్యింది. విమానాశ్రయంలోకి వెళ్తున్నప్పుడు కోహ్లీ ఫోన్‌పైన ఉన్న వాల్‌ పేపర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

వైరల్‌ అయిన ఫొటో

విరాట్ కోహ్లీ ఫోన్ వాల్‌పేపర్‌గా బాబా నీమ్ కరోలి(Baba Neem Karoli) ఫొటో ఉండడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోతో సోషల్‌ మీడియాలో విరాట్‌ మరోసారి వైరల్‌గా మారాడు. విరాట్ కోహ్లీ ఫోన్‌లో నీమ్ కరోలి బాబా వాల్‌పేపర్‌ ఉందని వోహ్రా ట్వీట్‌ చేశాడు. వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే విరాట్ కోహ్లీ ఫోన్‌ వాల్‌ పేపర్‌గా బాబా నీమ్ కరోలి ఫొటో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు మీ శుభాకాంక్షలే భారత్‌కు విజయాన్ని అందించాయని నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. 2023లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాబా నీమ్ కరోలి ఆశ్రమాన్ని సందర్శించారు. గత సంవత్సరం హోలీ నాడు బాబా నీమ్‌ కరోలికి ఈ దంపతులు నివాళులు అర్పించారు. 

 

బాబా నీమ్ కరోలి ఎవరు? 

చాలా మంది బాబా నీమ్ కరోలి భక్తులు... ఆయనను హనుమంతుని అవతారమని నమ్ముతారు. ఆయన గురించిన అనేక అద్భుత కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి. బాబా నీమ్‌ కరోలి ప్రధాన ఆశ్రమం కైంచి ధామ్‌లో ఉంది, దీనిని 1964లో స్థాపించారు. ఆపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌లతో పాటు, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా బాబా నీమ్ కరోలీకి భక్తులుగా ఉన్నారు. జూకర్ బర్గ్ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. స్టీవ్ జాబ్స్ కూడా 1970లలో ఈ ఆలయాన్ని సందర్శించారు. కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాతనే స్టీవ్ జాబ్స్ యాపిల్‌ కంపెనీని పెట్టడంపై దృష్టి పెట్టారని చాలామంది చెప్తారు. బాబా నీమ్‌ కరోలిని  మహారాజ్ జీ అని కూడా పిలుస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, ఆలయాలను కరోలి బాబా నిర్మించారు. 1900లో జన్మించిన కరోలి బాబా 1973లో మరణించారని చెప్తారు.