ప్రపంచకప్‌లో వరుస ఓటములతో తడబడుతున్న పాకిస్థాన్‌ జ్టటుపై విమర్శల జడి వాన కురుస్తోంది. అఫ్గాన్‌పై ఓటమి తర్వాత అభిమానులు, మాజీ క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ పాకిస్థాన్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ చూస్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. 280 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఛేదించడం సాధారణ విషయం కాదన్న వసీమ్‌.. దీనికి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ లోపం కూడా ఒక కారణమని విశ్లేషించాడు. పిచ్‌ ఎవరికి సహకరించింది అన్న విషయాలను పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్, ఫిట్‌నెస్ స్థాయిలు ఎలా ఉన్నాయో ఈ ప్రపంచకప్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని అక్రమ్‌ అన్నాడు. రెండేళ్లుగా పాక్‌ ఆటగాళ్లకు అసలు ఫిట్‌నెస్ టెస్టులే చేయట్లేదని గుర్తు చేశాడు. పాక్ ఆటగాళ్లను చూస్తుంటే ఒక్కొక్కరు రోజూ ఎనిమిది కిలోల మటన్ తింటున్నట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశాడు. పాక్‌ ఆటగాళ్లకు  ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలని.... దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్‌గా ఫిట్‌గా ఉండాలని వసీమ్‌ అక్రమ్‌ సూచించాడు. డబ్బూ తీసుకుని ఆడుతున్నప్పుడు ప్రొఫెషనల్‌గా ఉండాలని సూచించాడు. 

 

ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలన విజయం సాధించి పాక్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ విజయం సాధించింది. పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ 58 పరుగులతో రాణించారు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. అఫ్గాన్‌ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 65.... ఇబ్రహీం జాద్రాన్‌ 74 పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహ్మత్‌ షా 77, హష్మాతుల్లా షాహిది 48 పరులతో సమయోచితంగా రాణించారు. అఫ్గాన్‌ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్‌పై ఓటమితో పాక్‌ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాక్‌ మిగిలిన 4 మ్యాచ్‌ల్లో నెగ్గి రన్‌రేట్‌ కూడా కలిసొస్తేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.

 

పాక్‌ ఆడిన అయిదు మ్యాచుల్లో తొలి రెండు మ్యాచులను గెలిచిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. భారత్‌, ఆస్ట్రేలియా, అఫ్గాన్‌ చేతుల్లో భంగపాటుకు గురైన పాక్‌... ఇప్పుడు సెమీస్‌ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. హ్యాట్రిక్ ఓటమితో పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌ 4లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక్క మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయినా పాక్‌ ఆశలు గల్లంతే. ఇప్పటికీ సెమీఫైనల్‌ చేరుకోవడానికి పాక్‌కు అవకాశమైతే ఉంది. కానీ ఈ అవకాశం చాలా క్లిష్టంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో పాక్ నిలవాలంటే ఇక ఓటమి, వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అనే మాటే ఉండకూడదు. 2019లోనూ పాక్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2019 ప్రపంచకప్‌లో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ఇప్పుడు కూడా పాక్‌ అదే స్థితిలో ఉంది. వర్షం పడకుండా మిగిలిన నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు రావాలి. చెన్నైలో దక్షిణాఫ్రికాతో, కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో, బెంగళూరులో న్యూజిలాండ్‌తో కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో పాక్‌ తలపడాల్సి ఉంది.