దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024)లో టీమిండియా(Team India) వెటరన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజరా(Cheteshwar Pujara) సత్తా చాటాడు. ఈ నయా వాల్‌ డబల్‌ సెంచరీతో సెలక్టర్లకు హెచ్చరికలు పంపాడు. కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పుజారా,  జార్ఖండ్‌(Jharkhand)తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌తో రంజీ ట్రోఫీని ఘనంగా ప్రారంభించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా..తొలి మ్యాచ్‌లోనే ద్వి శతకంతో చెలరేగాడు. ఇంగ్లండ్‌(England)తో టీమిండియా టెస్టు సిరీస్‌ జట్టు ప్రకటనకు ముందు.. తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు పుజారా గట్టి సందేశం ఇచ్చాడు. పుజారా డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో జార్ఖండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 302 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేశాడు.

 

పుజారా భారీ ద్వి శతకం

స్పెష‌లిస్ట్ టెస్ట్‌ బ్యాటర్ అయిన పూజారా 243 ర‌న్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ వైఫ‌ల్యంతో జ‌ట్టుకు దూర‌మైన నయావాల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్ట‌ర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు ప్రేర‌క్ మ‌న్కడ్ కూడా శతకం చేయడంతో సౌరాష్ట్ర 5784 వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

హైదరాబాద్‌ భారీ విజయం

రంజీ ట్రోఫీ 2023-2024 సీజన్‌ను హైదరాబాద్‌ ఘనంగా ప్రారంభించింది. రెండు రోజుల్లోనే నాగాలాండ్‌ను మట్టికరిపించింది. ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో నాగాలాండ్‌పై హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. తొలుత రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీ... కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతకంతో భారీ స్కోరు చేసిన హైదరాబాద్‌... తర్వాత నాగాలాండ్‌ను రెండు ఇన్నింగ్సుల్లోనూ తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేసింది. హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి నాగాలాండ్‌ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. హైదరాబాద్‌ బ్యాటర్ రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో రవిశాస్త్రి తర్వాత రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ గుర్తింపు పొందాడు. గహ్లోత్‌ రాహుల్‌ సింగ్‌( Gahlaut Rahul Singh) డబల్‌ సెంచరీ, టీమిండియ యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మ(Tilak Varma) భారీ సెంచరీలతో చెలరేగడంతో... హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 76.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 474 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

కుప్పకూలిన నాగాలాండ్‌

తొలి ఇన్నింగ్స్‌లో 51.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్‌ అయిన నాగాలాండ్‌  ఫాలో ఆన్‌ ఆడించింది. అయితే హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఇన్నింగ్స్‌ 194 పరుగుల తేడాతో హైదరాబాద్‌ భారీ విజయం సాధించింది. రెండ్రోజుల్లోనే ఈ టెస్టు మ్యాచ్‌ ముగిసిపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో టి.త్యాగరాజన్‌ అత్యధికంగా ఎనిమిది వికెట్లు పడగొట్టగా.. చామా మిలింద్‌కు ఆరు వికెట్లు దక్కాయి. తెలుకపల్లి రవితేజ రెండు, కార్తికేయ మూడు, రోహిత్‌ రాయుడు ఒక వికెట్‌ పడగొట్టారు.