Virat Kohli:  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కావడానికి మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ ట్రోఫీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌పై క్రికెట్ ప్రేమికుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల కంటే, భారత జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఈ ట్రోఫీ కోసం ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.  ట్వీట్ ద్వారా కింగ్ కోహ్లీ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.


కోహ్లీ ట్వీట్


'రేపట్నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడబోతున్నాను. ఎల్లప్పుటూ ఉత్తేజకరమైన సిరీస్ లో భాగంగా ఉంటాను' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. దానికి తను ప్రాక్టీస్ చేస్తున్న 2 చిత్రాలను యాడ్ చేశాడు. దీనిపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ట్వీట్ ను ఇప్పటివరకు 56వేల మంది లైక్ చేశారు. 


రేపటి నుంచి సిరీస్‌ ప్రారంభం 


బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటినుంచి (ఫిబ్రవరి 9) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో రెండో మ్యాచ్.. మూడో మ్యాచ్ మార్చి 1 నుంచి ధర్మశాలలో, నాలుగో మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్నాయి.






విరాట్ కోహ్లీపై ప్రెజర్


గత మూడున్నరేళ్లలో క్రికెట్ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడుకున్న టాపిక్... కోహ్లీ. సెంచరీలు. కానీ అన్నింటి కరవు తీర్చేస్తూ వస్తున్నాడు. ఏషియా కప్ లో అఫ్గానిస్థాన్ పై సెంచరీ మొదలు.... వన్డేల్లో పెద్ద గ్యాప్ లేకుండానే 3 సెంచరీలు కొట్టేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. కానీ టెస్టుల్లో ఫాం ఇంకా కలవరపెడుతోంది. ఎప్పుడో 2019 చివర్లో బంగ్లాదేశ్ పై ఆఖరి టెస్టు సెంచరీ. సెంచరీల సంగతి పక్కన పెట్టండి. 2020లో యావరేజ్ 19, 2021లో 28, 2022 లో 27.... కోహ్లీ స్థాయి లాంటి బ్యాటర్ కే కాదు... అసలు ఏ బ్యాటర్ కు అయినా సరే ఇది యాక్సెప్ట్ చేయలేని రికార్డ్. కచ్చితంగా ఈ నంబర్స్ ను ఈ సిరీస్ ద్వారా కోహ్లీ మెరుగుపర్చుకోవాలి. ఈ మధ్యే ఫాంలోకి వచ్చేశాడు కదా.... టెస్టుల్లో కూడా దాన్ని రెప్లికేట్ చేయాలని ఫ్యాన్స్, టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కానీ కోహ్లీకి ఊరటనిచ్చే విషయం ఏంటో తెలుసా...? ఎదురుగా ఉన్నది తన ఫేవరెట్ అపోజిషన్ ఆసీస్. ఆడుతోంది తన ఫేవరెట్ ఫార్మాట్... టెస్టులు. ఇప్పటిదాకా ఆసీస్ పై కోహ్లీ 7 సెంచరీలు సాధించాడు. ఏ దేశంపై అయినా సరే ఇదే అత్యధికం. చూద్దాం రెడ్ బాల్ ఫార్మాట్ లో కోహ్లీ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటాడో లేదో.