దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో టీమ్‌ఇండియా(Team India) పేసర్‌... భువనేశ్వర్‌ కుమార్‌(Bhuvneshwar Kumar) చెలరేగిపోయాడు. ఆరేళ్ల విరామం తర్వాత రంజీల్లో పునరాగమనం చేసిన భువీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కొన్నాళ్లుగా ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయిన రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి సెలక్టర్ల చూపును తన వైపునకు తిప్పుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఉన్న భువీ... ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్రికెట్‌ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్‌ తొలి మ్యాచ్‌లోనే  22 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్‌లు ఉన్నాయి.

 

భువీ మ్యాజిక్‌

బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజు  ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మరో ముగ్గురిని ఔట్ చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఏకంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8/41 (22 ఓవర్లు)తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

 

దీంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది.  తొలి రోజు ఆట ముగిసే సరికే భువీ ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. భువీ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం ఇది 13వసారి. ఈ క్రమంలో 95/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్‌ 188 పరుగులకు ఆలౌట్‌ అయింది.  తొలిరోజు సౌరవ్‌ పాల్‌, సుదీప్‌ కుమార్‌, అనుస్తుప్‌ మజుందార్‌, కెప్టెన్‌ మనోజ్‌ తివారి, అభిషేక్‌ పోరెల్‌లను అవుట్‌ చేసిన భువీ... రెండో రోజు ఆటలో శ్రేయాన్ష్‌ ఘోష్‌,  ప్రదీప్త ప్రమాణిక్‌, సూరజ్‌ సింధు జైస్వాల్‌లను అవుట్‌ చేశాడు. దీంతో భువీ ఖాతాలోని వికెట్ల సంఖ్య ఎనిమిది చేరింది.

 

తొలి ఇన్నింగ్స్‌ ఇలా....

కాన్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగాల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కెప్టెన్‌ మనోజ్‌ తివారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌలర్లు చెలరేగారు. బెంగాల్‌ బౌలర్ల దెబ్బకు ఉత్తర్‌ప్రదేశ్‌ కేవలం 20.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్‌ షమీ తమ్ముడు మహ్మద్‌ కైఫ్‌ నాలుగు వికెట్లతో యూపీ పతనాన్ని శాసించాడు. యూపీ బ్యాటర్లలో ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ 13 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగాల్‌ను.... టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ముప్పుతిప్పలు పెచ్చాడు. బెంగాల్‌ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వకుండా చెలరేగాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన భువీ 1.90 ఎకనామీతో ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. మొదటి రోజు ఆట పూర్తయ్యే సరికి భువనేశ్వర్‌ కుమార్‌ ఐదు వికెట్లు కూల్చగా.. బెంగాల్‌ బ్యాటర్లు శ్రేయాన్ష్‌ ఘోష్‌ 37, కరణ్‌ లాల్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన బెంగాల్‌ 35 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

 

రెండో రోజు ఈ క్రమంలో 95/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టిన బెంగాల్‌ 188 పరుగులకు ఆలౌట్‌ అయింది. బెంగాల్‌ ఆలౌట్‌ అయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ ఆరంభించిన ఉత్తరప్రదేశ్‌ జట్టు శనివారం ఆట పూర్తయ్యేసరికి 18 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. సమర్థ్‌ సింగ్‌ 21, ఆర్యన్‌ జుయాల్‌ 20 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.