England's Heaviest Defeats By Runs: రాజ్‌కోట్‌ టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌(England)పై ఏకంగా 434  పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్‌ ద్వి శతక గర్జనతో బ్రిటీష్‌ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో  434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ  ఓటమితో ఇంగ్లాండ్‌ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. టెస్టులలో ఇంగ్లండ్‌ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్‌ తేడాతో ఓడింది. 21వ శతాబ్దంలో బ్రిటీష్‌ జట్టుకు ఇదే అతిపెద్ద పరాజయం కావడం గమనార్హం. భారత్‌ మాత్రం టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఈ ఓటమిపై ఇంగ్లాండ్‌ సారధి బెన్‌ స్టోక్స్‌ స్పందించాడు.




 

స్టోక్స్‌ ఏమన్నాడంటే

బెన్ డకెట్ సూపర్‌ సెంచరీతో అద్భుతంగా ఆడాడని  తొలి ఇన్నింగ్స్‌ ఆసాంతం ఇదే దూకుడుగా ఆడాలని భావించామని స్టోక్స్‌ అన్నాడు. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు దగ్గరగా వెళ్లేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా తాము ఆ అవకాశాలను చేతులారా వృథా చేసుకున్నామని తెలిపాడు. బౌలింగ్‌ చేద్దామని ముందే అనుకున్నామని... కానీ, అనుకున్నదానికంటే చాలా ముందుగానే బౌలింగ్‌ వేయాల్సి వచ్చిందన్నాడు. తాము ఇప్పుడు 1-2తో వెనుకబడి ఉన్నామని... కానీ తప్పకుండా పుంజుకుని సిరీస్‌లో ముందడుగు వేస్తామన్నారు. వచ్చే రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే సిరీస్‌ను నెగ్గేందుకు ఆస్కారముందని బెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. 

 

రోహిత్‌ ఏమన్నాడంటే....

ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడి తమను ఒత్తిడిలోకి నెట్టారని రోహిత్‌ అన్నాడు. తమ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని... ప్రత్యర్థి బ్యాటర్లు బజ్‌బాల్‌తో దూకుడుగా ఆడుతున్న సమయంలోనూ ప్రశాంతంగా ఉండాలని తమ బౌలర్లకు చెప్పానని రోహిత్‌ తెలిపాడు. కానీ మూడో రోజు తమ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పేశారని తెలిపాడు. టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు రెండు, మూడు రోజులపైనే దృష్టి పెట్టుద్దని... చివరి రోజు వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నామని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. 

 

రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. సర్ఫరాజ్‌ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడని రోహిత్‌ తెలిపాడు. ఇక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జైశ్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారని అన్నాడు. వారిద్దరూ మాకు కావాల్సిన ఆధిక్యాన్ని అందించారుని జైశ్వాల్‌ గురించి ఎంత చెప్పకున్న తక్కువే. అతడొక అద్బుతం.. ఇదే విషయంపై చాలా సార్లు ఇప్పటికే చెప్పానని తెలిపాడు. యశస్వీ భవిష్యత్తులో కచ్చితంగా వరల్డ్‌క్రికెట్‌ను ఏలుతాడని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు.