Ishan And Iyer News:  అనుకున్నట్లే జరిగింది. దేశవాళీ టోర్నమెంట్లపై నిర్లక్ష్యం చూపిన ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్స్‌ అయ్యర్‌(Shreyas iyer)పై బీసీసీఐ(BCCI) కొరఢా ఝుళిపించింది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను కాంట్రాక్టుల నుంచి తొలగించింది. దక్షిణాఫ్రికా(South Africa) పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన కిషన్‌ తరువాత జరిగిన ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya)తో కలసి ప్రాక్టీస్‌ చేశాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్‌ జట్టు ఆడాలని బీసీసీఐ..హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) చెప్పినా ఇషాన్‌ కిషన్‌ వినలేదు. తరఫున అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో, బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆడాలని శ్రేయస్‌ అయ్యర్‌ను కోరినా అతడూ దూరంగా ఉన్నాడు. సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా A+ జాబితాలో నిలవగా రాహుల్‌, గిల్‌, సిరాజ్‌ గ్రేడ్‌ Aకు పదోన్నతి పొందారు. రిషబ్‌ పంత్‌ B గ్రేడ్‌లో ఉన్నాడు. టీ20 స్టార్‌ రింకూసింగ్, హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ కొత్తగా గ్రేడ్‌ Cలో చోటు దక్కించుకున్నారు. నిర్దేశించిన వ్యవధిలో కనీసం మూడు టెస్టులు కాని, 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడితే వారిని కూడా గ్రేడ్‌ C లో చేరుస్తారు. ఈ కాంట్రాక్టులు అక్టోబర్‌ 1, 2023 నుంచి సెప్టెంబర్‌ 30, 2024 వరకు అమలులో ఉంటాయి. ఫాస్ట్‌ బౌలింగ్‌ కాంట్రాక్టును బీసీసీఐ కొత్తగా సిఫార్సు చేసింది. దీనిలో ఆకాశ్‌దీప్‌, విజయ్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యశ్‌ దయాల్‌, విద్వాంత్‌ కావేరప్ప ఉన్నారు.


 గ్రేడ్ A+లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. గ్రేడ్ Aలో రవిచంద్రన్‌ అశ్విన్, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. గ్రేడ్‌ Bలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ కాంట్రాక్ట్‌ దక్కించుకున్నారు. గ్రేడ్ సీలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్‌ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్ ఉన్నారు. 


నాలుగు గ్రేడ్‌లు
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు గ్రేడ్స్‌ ఉన్నాయి. వీటిని ఏ+, ఏ, బీ, సీ గా విభజించారు. ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు యేటా రూ. 7 కోట్లు... ఏ కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్న వారికి రూ. 3 కోట్ల వేతనం దక్కుతోంది. సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు వార్షిక వేతనం కింద కోటి రూపాయలు అందుతున్నాయి. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు దక్కుతాయి.


బోనస్‌, మ్యాచ్‌ ఫీజు పెరుగుతాయా..?
టెస్ట్‌ క్రికెట్ వైపు మ‌ళ్లించేందుకు ఆట‌గాళ్లకు మ‌రిన్ని బోన‌స్‌ల‌తో పాటు టెస్టుల మ్యాచ్ ఫీజుల‌ను పెంచే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఒక ఆట‌గాడు అన్ని టెస్టులు ఆడితే చెల్లించే బోన‌స్‌లు ఇందులో చేర్చవ‌చ్చున‌ని నివేదిక పేర్కొంది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ను కాదని ఐపీఎల్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక క్యాలెండర్‌ ఈయర్‌లో సదరు ఆటగాడికి రెగ్యులర్‌గా వచ్చే బెనిఫిట్స్‌తో పాటు వారికి అదనంగా రివార్డ్‌ ఇవ్వాలని యోచిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ వైపునకు మళ్లేందుకు ఇది తోడ్పడుతోందని తెలిపారు.