క్రికెట్ ప్రేమికులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆసియా కప్ 2022లో దాయాదుల సమరానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మేజర్ టోర్నీలో భాగంగా నేడు జరిగే రెండో మ్యాచ్ లో భారత్, పాక్ తలపడనున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ తలపడుతున్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్ పై ఘనవిజయం సాధించింది. ఆ పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం కానుంది.


కూర్పు కుదిరింది!   
టీమిండియా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు. వారిద్దరూ ఎలాంటి భాగస్వామ్యం అందిస్తారో చూడాలి. వారి తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూపర్ ఫాంలో ఉన్న సూర్య నుంచి భారత్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్ లో పంత్, పాండ్య ఎలా ఆడతారో చూడాలి. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. యుజువేంద్ర చాహల్ తో పాటు ఆల్ రౌండర్ జడేజా స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ ముందుండి నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఉంటారు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి బదులుగా రవి బిష్ణోయ్, అశ్విన్ లలో ఒకరిని తీసుకునే అవకాశముంది. 


అందరి కళ్లూ అతనిపైనే
ఈ మ్యాచ్ భారత్ తో పాటు కోహ్లీకి చాలా కీలకం. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్.. నెల రోజుల విరామం తర్వాత మైదానంలో దిగుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తిరిగి గాడిన పడాలని చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు 2 నెలలు కూడా లేని సమయంలో కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడం చాలా ముఖ్యం.


పాక్ కూడా బలంగానే
మరోవైపు పాకిస్థాన్ కూడా బలంగానే కనిపిస్తోంది. కెప్టెన్ బాబర్ అజాం ఆ జట్టుకు పెద్ద బలం. ఇటీవల అతడు సూపర్ ఫాంలో ఉన్నాడు. అతడితో పాటు మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, షాదాబ్ ఖాన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. అయితే బౌలింగ్ లో షహీన్ దూరం కావడం ఆ జట్టుకు ఆందోళన కలిగించేదే. అతనితోపాటు మహ్మద్ వసీం కూడా దూరమయ్యాడు. అయినప్పటికీ నసీమ్ షా, హస్నైన్, దహానీ వంటి ప్రతిభావంతులు వారికి అందుబాటులో ఉన్నారు. స్పిన్ భారాన్ని ఖాదిర్, షాదాబ్, నవాజ్ మోయనున్నారు. 


తేలిగ్గా తీసుకుంటే నష్టమే
పాకిస్థాన్ ను తేలిగ్గా తీసుకుంటే భారత్ కు తీరని నష్టం కలుగుతుంది. ఇది గత టీ20 ప్రపంచకప్ లోనే అర్థమైంది. గత ఏడాది 10 వికెట్ల ఘోర పరాజయాన్ని టీమిండియా మూటగట్టుకుంది. మళ్లీ ఓటమి దరిచేరకూడదనుకుంటే పాక్ పై మ్యాచ్ లో అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. 


ముఖాముఖి పోరు 
ఆసియాకప్ లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 14 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 8 మ్యాచ్ ల్లో నెగ్గింది. పాకిస్తాన్ 5 సార్లు గెలిచింది. మరో మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఇక టీ20ల్లో ఈ రెండు జట్లు 8 సార్లు తలపడగా భారత్ 6 సార్లు, పాక్ 2 సార్లు నెగ్గాయి. 


భారత తుది జట్టు (అంచనా)


 రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా, చాహల్, జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అవేష్బిష్ణోయ్అశ్విన్.