Ravichandran Ashwin: రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా(Team India)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)... మ్యాచ్‌ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్‌ ఎమర్జెన్సీ(Family Medical Emergency) కారణంగా అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు అశ్విన్‌ చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ట్వీట్‌ చేశారు. అశ్విన్‌ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానట్లు శుక్లా ట్వీట్‌ చేశారు. అశ్విన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించిన బీసీసీఐ... ఆటగాళ్ళ సంబంధికుల ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమైనదని ట్వీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గతంలో అశ్విన్‌ బౌలింగ్‌పై అతడి తండ్రి రవిచంద్రన్‌  చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
  

 

అశ్విన్‌ తండ్రి ఏమన్నారంటే..?

అశ్విన్‌ కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్‌ పాయింట్‌ తన బౌలింగ్‌ను మార్చుకోవడమేనని రవిచంద్రన్‌ తెలిపారు. ఆఫ్ స్పిన్నర్‌గా అశ్విన్‌ బౌలింగ్‌ చేయడం ప్రారంభించాక ఇక తను వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే తలెత్త లేదని గుర్తు చేసుకున్నారు. తన భార్య చిత్ర చేసిన కీలక సూచనే అశ్విన్‌ తలరాతను మార్చిందని రవిచంద్రన్‌ తెలిపారు. మీడియం పేసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అశ్విన్‌కు మోకాలి నొప్పి సమస్యగా ఉండేదన్న రవిచంద్రన్‌... అప్పుడు అశ్విన్‌ తల్లి కొన్ని అడుగులు వేసి స్పిన్ బౌలింగ్‌ వేయొచ్చు కదా అని అడిగిందని అదే అశ్విన్‌ క్రికెట్‌ కెరీర్‌ను మార్చేసిందని తెలిపారు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాక అశ్విన్‌తో మాట్లాడానని. ఇది తప్పకుండా కెరీర్‌లో అతిపెద్ద ఘనతే. కానీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనేది అతడి అభిప్రాయమని రవిచంద్రన్ వెల్లడించారు.

 

అశ్విన్‌ కొత్త చరిత్ర

భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టిస్తున్నాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

 

అగ్ర స్థానంలో మురళీధరన్‌

ఈ జాబితాలో శ్రీలంక స్టార్‌ స్పిన్నర్‌ అగ్ర స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్‌ కేవలం 87 టెస్టుల్లో 500 వికెట్లు తీశాడు. భారత్‌ నుంచి 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి అనిల్‌ కుంబ్లే (619 వికెట్లు) తర్వాతి స్థానంలో అశ్విన్‌ నిలిచాడు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొమ్మిదో ఆట‌గాడిగా అశ్విన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇందులో 5 వికెట్లు ప్రద‌ర్శన 34 సార్లు న‌మోదు చేశాడు. ఇప్పటికే వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచులో అశ్విన్‌(Ravichandran Ashwin )రికార్డు సృష్టించాడు.