వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా జోరు మీదుంది. ఆడిన అయిదు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్‌ సేన..పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. రేపు(ఆదివారం) తన తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించి 2019 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే చీలమండ గాయంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌లకు కూడా దూరం అయ్యాడు. అక్టోబర్ 29న భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో పాటు నవంబర్ 2, నవంబర్ 5 తేదీల్లో జరిగే మ్యాచ్‌లకు కూడా హార్దిక్ అందుబాటులో ఉండడం లేదు. హార్దిక్‌ కీలక మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు తుది జట్టు ఎంపిక గందరగోళంగా మారింది. గత మ్యాచ్‌లో  శార్దూల్‌పై వేటు వేసి షమిని తీసుకోగా హార్దిక్‌ పాండ్యా స్థానంలో స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. షమి అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టగా.. సూర్య విఫలమయ్యాడు.

 

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి....

ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో లక్నోలో మ్యాచ్‌ జరగనుంది. లక్నో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో హార్దిక్‌ స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అశ్విన్‌ తుది జట్టులోకి వచ్చి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఇద్దరు పేసర్లకే జట్టులో స్థానం ఉంటుంది. బుమ్రా స్థానం పదిలం కాబట్టి బుమ్రాకు తోడుగా సిరాజ్‌, షమిల్లో ఎవరిని ఎంచుకోవాల్సి వస్తుంది. సిరాజ్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ షమి గత మ్యాచ్‌లో అదరగొట్టాడు. మరోవైపు పేసర్లను ఇద్దరికే పరిమితం చేయడంపైనా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్‌ ఉంటే మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో ఉపయోగపడడమే కాక.. మూడో పేసర్‌ పాత్ర పోషించేవాడు. ఒకవేళ అశ్విన్‌ను ఆల్‌రౌండర్‌గా జట్టులోకి తీసుకుంటే సూర్యపై వేటు వేసి ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగవచ్చు.  ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో బలహీనంగా కనిపిస్తున్నంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున బ్రిటీష్‌ జట్టు ఎంత విధ్వంసం సృష్టించగలదో అందరికీ తెలుసు.

 

హార్దిక్‌ పాండ్యా ఈ వారాంతానికి కోలుకునే అవకాశం ఉందని... కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం ఇవ్వడం ముఖ్యమని NCA వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భారత్‌ సెమీస్‌ ముంగిట నిలిచినందున నాకౌట్‌ మ్యాచులకు ముందు  హార్దిక్‌కు విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాండ్యాకు చీలమండ గాయం తగ్గుతోందని... అదృష్టవశాత్తూ కాలుకు ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని BCCI వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హార్దిక్‌ను ఈ మ్యాచ్‌లకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో హార్దిక్ చికిత్స తీసుకుంటున్నాడని.. అతని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవరినీ జట్టులోకి తీసుకునే ఆలోచన లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.