WPL 2025 Update: ప్రారంభమైన డబ్ల్యూపీఎల్.. గుజరాత్ భారీ స్కోరు.. ఆర్సీబీతో తొలి మ్యాచ్
టోర్నీలోని ప్రతి జట్టు మరో జట్టుతో రెండేసి చొప్పున మ్యాచ్ లు ఆడతాయి. అలా మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్ లో నిలిచిన జట్టు నేరుగా పైనల్ కు అర్హత సాధిస్తుంది.

RCB Vs GG Live Updates: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. గుజరాత్ లోని బరోడా కోటంబి స్టేడియంలో డబ్ల్యూపీఎల్ కు శ్రీకారం చుట్టారు. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళురు, గుజరాత్ జెయింట్స్ తో తలపడుతోంది. 2023లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ లో ఇది మూడో సీజన్ కావడం విశేషం. తొలి సీజన్ ను ముంబై ఇండియన్స్ గెలుచుకోగా, గతేడాది ఆర్సీబీ ఆ ముచ్చట తీర్చుకుంది. రెండుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలవడం విశేషం. ఈ సారి వేలంలో కీలకమైన ఆటగాళ్లన దక్కించుకుంది. టోర్నీలోని ప్రతి జట్టు మరో జట్టుతో రెండేసి చొప్పున మ్యాచ్ లు ఆడతాయి. అలా మొత్తం 20 లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక టాప్ లో నిలిచిన జట్టు నేరుగా పైనల్ కు అర్హత సాధిస్తుంది. టాప్ 2, 3 జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. బెంగళూరును స్మృతి మంధాన, ముంబైని హర్మన్ ప్రీత్ కౌర్, యూపీని దీప్తి శర్మ, ఢిల్లీని మెగ్ ల్యానింగ్, గుజరాత్ ను అష్లీ గార్డెనర్ కెప్టెన్లుగా నడిపిస్తున్నారు. ఇక ఈ మెగాటోర్నీ స్పోర్ట్స్ 18 2 చానల్, జియో సినిమా ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు దాదాపు నెలరోజుల పాటు జరుగుతుంది. +
గుజరాత్ భారీ స్కోరు..
శుక్రవారం ప్రారంభమైన తొలి మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ భారీ స్కోరు సాధించింది. యాష్లీ గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (37 బంతుల్లో 79 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 201 పరుగులు చేసింది. జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ బేత్ మూనీ (42 బంతుల్లో 56, 8 ఫోర్లు) రాణించింది. ఆరంభంలోనే లారా వోల్వర్ట్ (6), డయాలన్ హేమలత (4) వెనుదిరిగినా మూనీతో కలిసి గార్డెనర్ జట్టును నడిపించింది. మూనీ ఉన్నంత సేపు వేగంగా ఆడింది. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులెత్తించింది. దీంతో 37 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని వెనుదిరిగింది.
గేర్లు మార్చిన గార్డెనర్..
మూనీ ఔటయ్యాక గార్డెనర్ గేర్లు మార్చి సిక్సర్లతో చెలరేగింది. ఆమె ఇన్నింగ్స్ లో 3 బౌండరీలు ఉంటే, 8 సిక్సర్లు ఉండటం విశేషం. డియెండ్రా డాటిన్ (13 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్సర్) క్యామియో ఆడటంతో గుజరాత్ 200 పరుగుల మార్కును అవలీలగా దాటింది. బౌలర్లలో రేణుక సింగ్ కు రెండు వికెట్లు దక్కగా, కనిక అహుజా, జార్జినా వారెహమ్, ప్రేమ రావత్ లకు తలో వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో నెగ్గి శుభారంభం చేయాలని స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.