Commonwealth Games 2022: భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. కామన్వెల్త్ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతకం గెలుచుకున్న మహిళల జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. న్యూజిలాండ్ తో జరిగిన పోరు 1-1తో ముగియగా.. తర్వాత నిర్వహించిన పెనాల్టీ షూటవుట్ లో 2-1 తేడాతో భారత మహిళలు విజయాన్ని అందుకున్నారు. ఈ పోరులో మొదటి నుండి భారత జట్టే ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ముగియడానికి కొన్ని సెకన్ల ముందు మాత్రమే న్యూజిలాండ్ స్కోరును సమం చేయగలిగింది. దీంతో ఆట పెనాల్టీ షూటవుట్ కు వెళ్లింది. ఇందులో భారత్ అద్బుతమైన ప్రదర్శన చేసిందనే చెప్పాలి. పెనాల్టీ రౌండ్ లో షూటవుట్ లో న్యూజిలాండ్ ఒక్క గోల్ మాత్రమే సాధించింది. భారత కెప్టెన్ మరియు గోల్‌కీపర్ సవితా పునియా నాలుగు షూటలలో మూడింటిని విజయవంతంగా అడ్డుకోగలిగింది. భారత్ 2 గోల్స్ తో కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. 



మోదీ ప్రత్యేక అభినందనలు..


హాకీతో భారత్‌ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు మహిళా హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు గర్వపడతారని పేర్కొన్నారు. చాలా సంవత్సరాలలో మహిళల జట్టు CWG పోడియంపైకి రావడం ఇదే తొలిసారి అని జట్టుకు గర్వంగా ఉందని తెలిపారు. 


పతకాలు గెలుచుకున్న వారికి శుభాకాంక్షలు..


కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని ప్రధాని మోదీ అభినందించారు. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత ఉద్వేగానికి లోనైన భారత రెజ్లర్ పూజా గెహ్లాట్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ సందర్భంగా పూజా గెహ్లోత్ పై ప్రధాని ప్రశంసలు కురింపించారు. పూజ సాధించిన పతకం ఆనంద ఉత్సవాలకు కారణం అవుతుందన్న ప్రధాని.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆమెను ఓదార్చారు. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్ లో పూజా ఓడి పోయింది. కాంస్య పతకంలో గెలిచింది పతకాన్ని కైవసం చేసుకుంది. కాంస్య పతకానికే పరిమితం అయినందుకు మీడియా ముందుకు వచ్చి క్షమించాలని కోరుతూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియోపై స్పందించిన మోదీ పూజను అభినందిస్తూ  ట్వీట్ చేశారు. 'పూజా.. నీ జీవిత ప్రయాణం మాకు అందరికీ ఆదర్శం. నీ గెలుపు మాకు సంతోషాన్ని ఇచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగి పోవాలి. రాబోయే కాలంలో ఆమె భారతదేశం గర్వపడేలా చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను' అని ప్రధాని మోదీ పూజకు అండగా నిలిచారు. 


మీకందరికీ శుభాకాంక్షలు..


రెజ్లర్ దీపక్ నెహ్రా యొక్క కాంస్య పతకాన్ని ప్రశంసిస్తూ, అతను అద్భుతమైన పట్టుదల మరియు నిబద్ధతను ప్రదర్శించాడని మోదీ అన్నారు. అతని రాబోయే ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. మహిళల సింగిల్స్ పారా టేబుల్ టెన్నిస్‌లో బంగారు పతకం సాధించినందుకు భవినా పటేల్‌ను శ్రీను మోదీ అభినందించారు.