Vaikunta Ekadasi 2023 Date and Time: వైకుంఠ ఏకాదశి తిథి రెండు రోజులు ఉండడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్ పై కొంత గందరగోళం ఉంది. అయితే  ఏకాదశి తిథి సమయాలు గమనిస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన సమయంపై క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు పండితులు


డిసెంబరు 22 శుక్రవారం రోజు దశమి ఉదయం 9 గంటల 38 నిమషాల వరకూ ఉంది..ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమైంది. 
డిసెంబరు 23 శనివారం రోజు ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిముషాల వరకూ ఉంది..


వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోకి తీసుకోవాలి.  అందుకే ముక్కోటి ఏకాదశి డిసెంబరు 23 శనివారం వచ్చింది. ఆ రోజు తెల్లవారు ఝామునుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం. లేదంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి..కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. అంటే డిసెంబరు 22 శుక్రవారం సాయంత్రం, డిసెంబరు 23 శనివారం ఉదయం 8 గంటల లోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోచ్చు. ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబరు 23 శనివారమే నియమాలు పాటించాల్సి ఉంటుంది. 


Also Read: సుఖానికి ఆధారం ఏది - సిగ్గు అంటే ఏంటి, యక్ష ప్రశ్నలు ఇవే!


ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ప్రత్యేకం


ముక్కోటి  ఏకాదశి రోజు ఎక్కువ  మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయణుడిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.  రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని.. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. 


Also Read: ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఎందుకంటే!


''వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ''


ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని, మోక్షదాయకమే అని వేదవాక్కు. అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్కరోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా దేవతలకు రాత్రి..ఉత్తరాయణం అంతా పగలుగా చెబుతారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు. స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు...ఈ ద్వారం గుండా లోపలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. 


తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం డిసెంబరు 23నే


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా ,అదృష్టంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. 


2024 మేషరాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి









2024 మిథున రాశిఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 


2024 కర్కాటక రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి