Vaikuntha Ekadashi Fasting 2023: తిథుల్లో పదకొండో తిథి ఏకాదశి. అంటే పౌర్ణమి తరవాత వచ్చే 11వ రోజు, అమావాస్య తరవాత వచ్చే 11వ రోజు ఏకాదశి. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో మరొకటి చొప్పున ఏడాదికి 12 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అనగానే హిందువులకు మొదటగా గుర్తుకొచ్చేది తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశిలు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఆహరం తినకుండా ఉపవాసం ఉంటారు. అయితే దేవుడి పేరుతో చేసే ఉపవాసం అయినా, దీక్ష అయినా అది దేవుడికోసం అనుకుంటే పొరపాటే..దానివెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉంటాయి.  


Also Read: డిసెంబర్ 25 నుంచి ఈ 5 రాశుల వారికి మంచిరోజులొస్తున్నాయ్!


ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత
ఆషాఢమాసం నుంచి  పుష్యమాసం వరకూ వచ్చే ఏకాదశిల్లో...ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు. చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలుపెడతారు.. అదే తొలి ఏకాదశి. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు శ్రీ మహా విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకంలో ప్రవేశం ఉండదని విశ్వాసం. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు..ఇది శ్రీ  మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని ఈ రోజున ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు, జాగరణలు చేస్తారు


Also Read: ఈ శ్లోకాలతో మీ బంధుమిత్రులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి


11 ఇంద్రియాలతో చేసే పాపాల పరిహారం కోసమే ఉపవాసం
దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది.  మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం . పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు , మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి.. జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు. ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే.


Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!


ఏకాదశి ఉపవాసం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. ఏకాదశి తిధి రోజు చంద్రుడు,సూర్యుడు,భూమి మధ్య ఉండే దూరం,సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు. సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ప్రతి ఏకాదశికి అంటే 11 రోజులకోసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థ్యాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం