TTD Clarity On Srivari Laddu Prasadam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నూతన విధానం అంటూ జరుగుతోన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. లడ్డూ ప్రసాద విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తులు ఎలాంటి అపోహలు, వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని.. బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు చిన్న మార్పు చేసినట్లు స్పష్టం చేశారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని తెలిపారు.


దర్శన టికెట్, టోకెన్ కలిగిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తామని చెప్పారు. కొంతమంది స్వామి దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముతున్నారు. అలాంటి వారికి ఆధార్ తీసుకుని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు మేలు చేసే విధంగానే లడ్డూ ప్రసాద విక్రయం కొనసాగుతుందన్నారు. కాగా, తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ జారీ విధానంలో టీటీడీ (TTD) గురువారం నుంచి మార్పులు చేసినట్లు ఉదయం పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇస్తారని.. దర్శన టికెట్‌పై ఒక లడ్డూ, ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఖండించిన టీటీడీ దానిపై స్పష్టత ఇచ్చింది. 


మరోవైపు, లడ్డూ ప్రసాదం తయారీకి కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరాను టీటీడీ మళ్లీ ప్రారంభించింది. నందిని బ్రాండ్ నెయ్యి సరఫరాను ప్రారంభించగా.. బుధవారం రాత్రి మొదటి లోడును ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య జెండా ఊపి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ధర విషయంలో అంగీకారం కుదరక గతేడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని టీటీడీ కోరడంతో సరఫరాను తిరిగి ప్రారంభించినట్లు కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. 


లక్కీ డిప్ ద్వారా ఆ టోకెన్లు


ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తోన్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టోకెన్లను ఇకపై, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ భక్తులు తమ ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తామని..  టికెట్లు పొందిన భక్తుల మొబైల్‌కు మెసేజ్ పంపిస్తామని చెప్పారు. ఈ సమాచారం ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు ఆన్‌లైన్‌లో రూ.500 డిపాజిట్ చేయాలని సూచించారు. వీరు మహతి కళాక్షేత్రంలో ఆధార్ కార్డు చూపించి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చని తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తామన్నారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500 డిపాజిట్‌ను వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులకు.. లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందిన వారికి డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించమని చెప్పారు.


Also Read: CM Chandrababu: 'ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి' - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు