మనదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్‌లను కలిపి చార్‌ ధామ్‌ అని పిలుస్తారు. ఈ ఏడాది మే10 అక్షయ తృతియ రోజున చార్ ధామ్ యాత్ర మొదలైంది. లక్షలాదిమంది హిందువులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.  చార్‌ ధామ్‌ ప్రయాణం వెనుకున్న కారణాలు, ఈ యాత్ర ప్రాశస్థ్యం మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యాత్ర చేయడం వల్ల జీవితానికి ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయట. అవేంటో చూడండి


ఆధ్యాత్మిక జ్ఞానం


పరమాత్ముడితో అనుసంధానం చేసే యాత్రే చార్‌ ధామ్‌ యాత్ర. తీర్థయాత్ర చేసే సంకల్పం చేశారంటేనే ఎక్కడో సాత్వికత ఉందని అర్థం. చార్‌ ధామ్‌ ఒక సుదీర్ఘ తీర్థయాత్ర. ఈ యాత్ర ఆసాంతం మనసు ఒక పవిత్ర భావనతో ఉంటుంది. ఫలితంగా సానుకూల శక్తులను ఆకర్షించగలుగుతారు. ఈ యాత్ర జీవిత లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో మీకు ఎంతో తొడ్పడుతుంది. నిజానికి ఈ యాత్ర జీవన యానానికి ఒక మార్గదర్శనం వంటిది.


పాప ప్రక్షాళన


చార్‌ ధామ్‌ యాత్ర చేసిన వారికి జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు ప్రక్షాళన అవుతాయట. తెలిసీ తెలియక చేసిన అన్ని తప్పులకు ఈ యాత్ర ద్వారా మన్నింపు దొరుకుతుందని నమ్మకం. చార్‌ ధామ్‌ యాత్ర చేసి వచ్చిన వారు మరింత ఎరుక తో ఇక జీవితంలో పాపాలు చెయ్యకుండా జీవించాల్సి ఉంటుందని మరచిపోవద్దు.ః


ప్రకృతితో అనుసంధానం


చార్‌ ధామ్‌ లో కేవలం దైవదర్శనం మాత్రమే కాదు, ప్రకృతిలో లీనమైన భగవద్దర్శనం జరుగుతుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లలోని ప్రకృతి అందాలు ఒక అద్భుతమైన అనుభూతి ఇస్తుంది.


ఆయు వృద్ధి


చార్‌ ధామ్‌ యాత్ర శరీరానికి అరోగ్యాన్ని ప్రసాధిస్తుంది. ఆయుశ్శును పెంచుతుంది. చార్‌ ధామ్‌ యాత్ర చాలా కష్టాలకోర్చి చెయ్యవలసిన యాత్ర. ఇక్కడి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. పర్యావరణం కాలుష్యరహితంగా ఉంటుంది. భక్తి మనసును శుద్ధి చేస్తే అక్కడి పర్యావరణం నీళ్లు శరీరాన్ని శుద్ధి చేస్తుంది.


హిందూ ధార్మిక సంస్కృతి సందర్శన


హిందూ సంస్కృతిపై అవగాహన కోసం చాలా మంది విదేశీయులు ఈ యాత్ర కోసం మనదేశానికి వస్తుంటారు. అక్కడి ప్రజల జీవన విధానం, వారు ధరించే దుస్తులు, ఇతర నమ్మకాల గురించి తెలుసుకుంటారు. అక్కడి సమాజానికి దగ్గరగా మసలడం ద్వారా, సంస్కృతిని ఆకళింపు చేసుకోవడం ద్వారా సహజంగానే ప్రవర్తనలో పరివర్తనను స్వయంగా గుర్తించవచ్చు. ఈ పరివర్తన మన జీవితంలో గొప్ప మార్పుకు కారణం అవుతుంది కూడా.


మోక్షప్రాప్తి


చార్‌ ధామ్‌ యాత్ర చేసిన వారికి జననమరణ చక్రబ్రమణం నుంచి విముక్తి దొరకుతుందని నమ్మకం. కేదర్ నాథ్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత స్వామివారి అభిషేక జలం స్వీకరించిన భక్తులకు తప్పక మోక్షం సంప్రాప్తిస్తుందని చెప్తారు. బద్రీనాథ్ దామ్ సందర్శన చేసిన వారు తిరిగి గర్భప్రవేశం చెయ్యడని, ముక్తిని పొందుతాడని శాస్త్రం చెబుతోంది.


Also Read : Amarnath Yatra 2024: అమర్నాథ్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ తేదీల్లో వెళ్లేందుకు ప్లాన్ చెయ్యండి




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.