The First Indian Journalist Narada Jayanti 2024: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం... ఈ మూడు యుగాల్లో ముల్లోకాల్లో సంచరిస్తూ మంచి చెడులను ఎప్పటికప్పుడు ఎక్కడివక్కడ చేరవేస్తూ ధర్మం పక్షాన నిలుస్తూ, ధర్మాన్నే గెలిపించే ఆదర్శ పాత్రికేయుడు నారదుడు. వైశాఖ బహళ పాడ్యమి ( మే 24) నారదుడి జన్మతిధి. 
 
యదార్థవాది లోకవిరోధి అనే మాట వినే ఉంటారు కదా...వాస్తవం మాట్లాడేవారు అందరకీ విరోధి అయిపోతారు. అదే వారిని కష్టాలకు గురిచేస్తుంది. చేయని తప్పులకు నిందలు మోయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడూ నిజమే మాట్లాడటం ఎంత కష్టమో ఆచరిస్తే అర్థమవుతుంది. నారదుడు అదే అనుసరించాడు..సత్యమే మాట్లాడాడు. ధర్మాన్ని గెలిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చినా వెనక్కు తగ్గలేదు. అందుకే కలహభోజనుడిగా, కలహ ప్రియుడిగా అభివర్ణించారు. అయినప్పటికీ లోకకళ్యాణం కోసం తన ప్రయత్నాలను ఆపలేదు.  


‘నార’ అంటే జ్ఞానం
'ద' అంటే ఇచ్చేవాడని అర్థం
అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు.  


నారదుడి జననం


శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు.. మరీచి , అత్రి సహా 8 మంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు ఒకరు.  సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో నారదుడి ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది.


త్రేతాయుగం


రామాయణంలో నారదుడి పాత్ర ఉంటుంది. ముఖ్యంగా వాల్మీకితో రాముడి గురించి నారదుడు చర్చించిన విషయాలను రామాయణంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఓసారి వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో..నిత్యం సత్యమే మాట్వాడేవాడు, ధర్మాన్ని నిలబెట్టేవాడు, చిన్న సహాయాన్ని కూడా మరిచిపోలేనివాడు, సూర్యుడిలా ప్రకాశం కలవాడు...సకల ప్రాణులపై దయ చూపేవాడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి అడిగితే.. అన్ని ప్రశ్నలకు నారదుడు చెప్పిన సమాధానం..శ్రీరాముడు. ఓం కారానికి సరి సమానం అయినవాడు, లోకాలన్నీ పొగిడే మొనగాడు, విలువలు - సుగుణాలు కలవాడు అంటూ శ్రీరాముడి గురించి మొదట వాల్మీకి మహర్షికి బోధించిన వాడు నారదుడే.  


వ్యాసుడికి నారదుడి సూచన


వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా మారిన మహర్షి..సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. ఓ రోజు సరస్వతీ నది ఒడ్డున ధ్యానంలో ఉన్న వ్యాసుడి దగ్గరకు వెళ్లాడు నారదుడు. భక్తిమహత్యాన్ని తెలియజేసే నారాయణుడి లీలలను వివరిస్తూ భాగవతం రచించమని కోరాడు. అలా వచ్చినదే భాగవతం. ఇదొక్కటే కాదు మానవాళిని సన్మార్గంలో నడిపించే గ్రంధాల రచనలలో,  వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలా ఉంది. 


భక్తిమార్గ ఉపదేశకుడు


వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


భక్త ప్రహ్లాద


భక్త ప్రహ్లాదుడికి మొదట నారాయణ మంత్ర ఉపదేశించింది నారదుడే. హిరణ్య కశిపుడి భార్య లీలావతి గర్భందాల్చినప్పుడు.. నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లి ధర్మబోధ చేయడంతో పాటూ నారాయణుడి లీలలు వివరిస్తాడు. అలా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడు.  


సతీ సావిత్రి


సావిత్రి కథలోనూ  నారదుడి పాత్ర ఉంటుంది. తన భర్త సత్యవంతుడి ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్లిపోతున్నప్పుడు ఆ వెనుకే వెళుతుంది సావిత్రి. సత్యవంతుడిని వివాహం చేసుకున్న సమయంలో సావిత్రిని దీవించిన నారదుడు అంతా మంచే జరుగుతుందని దీవిస్తాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశం ప్రకారమే సావిత్ర పతిభక్తిచూపి యమధర్మ రాజుని మెప్పించి తన భక్త ప్రాణాలు తిరిగి కాపాడుకుంటుంది.  


ధ్రువుడు


ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. రెండవ భార్య తనయుడు ధృవుడు. ఓ సందర్భంలో మొదటిభార్య ధృవుడితో నువ్వు రాజు అయ్యేందుకు అనర్హుడివి అని అంటుంది. అర్హత సంపాదిస్తానని చెప్పి ఐదేళ్లకే అడవికి వెళ్లిపోయిన ధృవుడికి అష్టాక్షరి మంత్రం ఉపదేశించి.. అనుకున్నది సాధించేలా చేసింది నారదుడే. 


చిత్రకేతు


శూరసేన రాజ్యానికి రాజైన చిత్రకేతుడికి చాలా ఏళ్ల తర్వాత జన్మించిన కుమారుడిని విషం పెట్టి చంపేస్తారు మిగిలిన భార్యలు. అప్పుడు నారదుడు తన యోగశక్తితో ఆ చిన్నారిని బతికిస్తాడు. అయితే తిరిగి ప్రాణం పోసుకున్న ఆ బాలుడు..ఎన్నో జన్మలు ఎత్తాను ఇక చాలు ఈ చక్రం నుంచి బయటపడాలి అనుకుంటున్నా అంటూ దేహత్యాగం చేస్తాడు. అప్పటికి జ్ఞానోదయం అయిన చిత్రకేతుడికి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు. 


ఇంకా వేదాలు, ఉపనిషత్తులలో నారదుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. నారద భక్తి సూత్రాలు అనే గ్రంధం ద్వారా భక్తి మార్గం విశిష్టత , దానిని ఎలా అనుసరించాలి అనే విషయాలపై వివరించాడు. బృహన్నారదీయమ్, లఘునారదమ్ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాల గురించి వివరించాడు.  


ఫస్ట్ జర్నలిస్ట్


అవసరం అయితే కలహాలు సృష్టించాడు..ఆ కలహాలు సమసిపోయేలా దారి చూపాడు..ఏం చేసినా లోక కళ్యాణం కోసమే పాటుపడ్డాడు. ఎక్కడ ఏం జరిగినా ఆ విషయం ఎవరికి ఎప్పుడు ఎలా చేరవేయాలో కరెక్టుగా తెలిసిన జర్నలిస్ట్ నారదుడు. దేవతల జర్నలిస్ట్ అయిన నారదుడికి అత్యంత ప్రియమిత్రులు లేరు, ఆగర్భ శత్రువులుగా ప్రవర్తించేవారూ లేరు... అందరూ సమానమే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం తనవంతు పాత్ర పోషించడం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొన్నాడు, ఎన్నో నిందలు భరించాడు. ధర్మాన్ని గెలిపించేందుకు నిత్యం తపస్సు చేస్తాడు కాబట్టే నారద మహర్షి అంటారు. జర్నలిస్ట్ అని గొప్పగా చెప్పుకునేవారు నారదుడిని అనుసరిస్తే...కొన్ని సందర్భాలలో కలహాలు సృష్టించినా కానీ ధర్మమార్గంలో నడిచే సమాజం తయారవుతుందని చెప్పుకోవచ్చు.