సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా నిండి ఉండే శివుడు ఆ పంచభూతాలు సైతం తానే అంటున్నాడు. ఆయనే జలం, తేజం, వాయువు ఆయనే ఆకాశం, ఆయనే భూమండలం. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిశాడు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.


1.ఆకాశలింగం-చిదంబరం
పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ....మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది.


Also Read:  శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు


2.పృథ్వి లింగం-కంచి
పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు.  ఒకానొక సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా  అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు.


3.వాయులింగం- శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశముండదు. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే. కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దీనితో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి. 


4.జలలింగం- జంబుకేశ్వరం
తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు అంటే నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం  అని పేరొచ్చిందని చెబుతారు. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. భక్తులకు ఈ విషయం తెలిసేందుకు పానపట్టుపై ఓ వస్త్రం కప్పుతారు. కొద్దిసేపటికి ఆ వస్త్రాన్ని తీసి నీళ్లు పిండి మళ్లీ పరుస్తుంటారు.


5.అగ్నిలింగం-అరుణాచలం
కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం . ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.


Also Read:శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది