Kurudumale Ganesh Temple Karnataka: బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరం కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కొలువై ఉన్నాడు కురుడుమలై శక్తి గణపతి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ బొజ్జగణపయ్యని మొక్కుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంది.సుమారు 14అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిలతో తయారుచేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు)ప్రతిష్టించారని ప్రతీతి.  


స్థలపురాణం
త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు కూడా ఈ శక్తి గణపతిని సేవించారని అక్కడి స్థలపురాణం. లంబోదరుడు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కలలో కనిపించి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని చెప్పినట్టు అక్కడుకున్న శిలాశాసనాలు స్పష్టం చేస్తాయి. అప్పట్లో దీన్ని కూటాద్రి అని పిలిచేవారని కాలక్రమంలో అది కాస్త కురుడుమలెగా పేరుగాంచిందని చెబుతున్నారు


Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!


2వేల ఏళ్ళ క్రితం గుడి
ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2000ఏళ్ళ క్రిందటిదని పేర్కొన్నారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ  రాత్రిసమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, అక్కడి వారికి అపారమైన నమ్మకం. ఎందుకంటే ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని, పర్వదినాలలో దేవతలంతా వచ్చి స్వామిని సేవిస్తారని చెబుతుంటారు. 


ఏం కోరుకున్నా నెరవేరుతుంది
ఇక్కడి గణపయ్య ప్రత్యేకత ఏంటంటే..తలపెట్టిన పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుంటే విఘ్నాలు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు..ఏదైనా కొత్త పని లేదా ప్రాజెక్ట్ ప్రారంభించేముందు  కురుడుమలె గణపయ్యను దర్శించుకుని పని మొదలుపెడితే ఆ కార్యం నిర్విఘ్నంగా నెరవేరుతుందంటారు. ఈ ఆలయం సమీపంలో సోమేశ్వరస్వామివారు కూడా కొలువై ఉన్నారు.  ఈ ఆలయం విశిష్టత ఏంటే   మనం అనుకుంటే ఇక్కడకు వెళ్లలేమట..కేవలం లంబోదరుడి అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని చెబుతారు. 


Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..


కురుడుమలె వినాయకుడిని దర్శించుకోవాలి అనుకుంటే.... బెంగళూరు విమానాశ్రయం నుంచి 110 కిలోమీటర్లు. కురుదుమలె కి పది కిలోమీటర్ల దూరంలో హవేరి ర్వైల్వేస్టేషన్ ఉంది. నిత్యం బెంగళూరు, కోలార్ సమీప ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. 


వినాయక శ్లోకాలు
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||


మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||


గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||


సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||