Krishna Janmashtami 2022:  తల్లి కడుపులో పడకముందే శత్రువు కాచుకుకూర్చున్నాడు...అర్థరాత్రి చెరసాలలో జన్మించాడు.. కన్నవారికి దూరంగా పెరిగాడు.. రాజభోగాలు అనుభవించాల్సినప్పటికీ బాల్యం ఆలమందల మధ్య గడిచింది.. ఇంకా చెప్పాలంటే దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు అనే సామెతలాంటిది శ్రీకృష్ణుడి జీవితం. అయినప్పటికీ ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు బతికి చూపించాడు. బాల్యంలో అల్లరి మానలేదు, యవ్వనంలో చిలిపి పనులు ఆపలేదు, సోదరుడిగా, భర్తగా, స్నేహితుడిగా, సన్నిహితుడిగా ఇలా ఏ కోణంలో చూసినా కన్నయ్యని మించినవరెవరు అనిపించకమానదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతితత్వం, నాయకత్వం ఇవన్నీ కలగలపితే శ్రీకృష్ణతత్వం. శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు.


తండ్రిని బంధించి రాజ్యం చేజిక్కించుకున్న కంసుడు
రాజ్యాన్ని పాలించాలనే  కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి అధికారం చేజిక్కించుకుంటాడు కంసుడు. సోదరి అంటే మాత్రం అంతులేని ప్రేమ. ఎంత ప్రేమంటే… దేవకిని యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేసిన కంసుడు అత్తవారింటికి సాగనంపేటప్పుడు స్వయంగా రథం నడుపుతాడు. మార్గమధ్యలో ఉండగా…ఆకాశవాణి పిలుపు వినిపిస్తుంది. ‘ఓ కంసా! నీ సోదరికి పెళ్లిచేసి దగ్గరుండి మరీ సాగనంపుతున్నావు. కానీ నీ సోదరి కడుపున పుట్టిన ఎనిమిదో సంతానమే నీ ప్రాణం తీస్తుందని పలుకుతుంది. దీంతో ఉగ్రరూపుడైన కంసుడు..సోదరిపై ఉన్న ప్రేమంతా పగగా మారిపోతుంది. ఆమె అష్టమ సంతానం నన్నుచంపుతుందా… నేను ఇప్పుడే దేవకిని చంపేస్తానంటూ కత్తి పైకెత్తుతాడు.


Also Read: శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


అంతులేని పగగా మారిన సోదరప్రేమ
అప్పటివరకూ కంసుడి కళ్లలో తన భార్యపై అంతులేని ప్రేమను చూసిన వసుదేవుడు…ఉన్నపాటుగా చంపేంత పగని చూసి  హుతాశుడవుతాడు. వెంటనే కాళ్లపై పడి దేవకిని చంపొద్దని వేడుకుంటాడు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది..అయితే పుట్టిన పిల్లలు అందర్నీ ఇచ్చేస్తానని కంసుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు వసుదేవుడు. అప్పటికి కాస్త ఆవేశం తగ్గడంతో చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో గుర్తొచ్చి చంపకుండా వదిలిపెట్టి గృహనిర్బంధంలో ఉంచుతాడు. అప్పటి నుంచి దేవకి-వసుదేవులకు పుట్టిన సంతానాన్ని చంపుతూ వస్తుంటాడు. ఏడుగురి వంతు అయిపోయింది. అష్టమ సంతానం భూమ్మీదపడే సమయం ఆసన్నమైంది. 


ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం. అప్పటి కప్పుడు ఓ అద్భుతం జరిగింది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలావాళ్లని మత్తు ఆవహిస్తుంది. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. ఇదంతా దైవలీల అని దేవకీ వసుదేవులకు అర్థమవుతుంది. అష్టమ సంతానం భూమ్మీద పడిన వెంటనే..ఎవరో మార్గ దర్శకత్వం చేసినట్టు వసుదేవుడు ఆ బిడ్డను ఎత్తుకుని యమునా నదివైపుకు నడుస్తాడు. ఎటు చూసినా వరదనీరు, ఎదురుగా నది..కానీ వసుదేవుడు నదిమధ్యనుంచి అలా సాగిపోతాడు. హోరున వానలో తన స్నేహితుడు నందుడి ఇంటికి చేరుకుంటాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె స్పృహలో ఉండకపోవడంతో కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టి..ఆ ఆడపిల్లతో తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు.


Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!


కారాగారంలో దేవకి పొత్తిళ్లలో చేరగానే ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. కాపలావాళ్లు అప్పుడే మేల్కొని కంసుడికి వార్త చేరవేస్తారు. వెంటనే అక్కడకు చేరుకున్న కంసుడు…తనను చంపబోయేది ఆడపిల్లా.. ఇది నిజమేనా అని కాపలా వాళ్లని ప్రశ్నిస్తాడు. అవునని ఆడపిల్లనే చూశామని చెబుతారు. అదే సమయంలో దేవకి వసుదేవులు కూడా వేడుకుంటారు…మగపిల్లడైతే చంపేవాడేమో ఆడపిల్ల కదా వదిలేయమని. కానీ కరుణించని కంసుడు ఆ చిన్నారిని చంపేందుకు ప్రత్నించగా ఆమె మాయమవుతుంది. నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడనే మాటలు వినిపిస్తాయి. అప్పటి నుంచీ కృష్ణుడిని అంతం చేయడానికి కంసుడు చేయని ప్రయత్నం లేదు.


Also Read: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారు, కన్నయ్య అడుగు పెడితే!


దిక్కుతోచని స్థితిలో ఊరూరు వెతికించాడు, దొరికిన ప్రతి శిశువునూ ఖండ ఖండాలుగా నరికి చంపాడు. ఎంతోమంది రాక్షసులను బాలకృష్ణుడుని సంహరించడానికి పంపాడు. కానీ వారంతా బాలకృష్ణుడి చేతిలో చనిపోతారు.  ఆ తర్వాత కంసుడు మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించుతాడు. వారిని కూడా బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు తీసేస్తారు. అప్పటికి కంసుడికి అర్థమవుతుంది..తన ప్రాణం పోవడం తథ్యం అని. అలా ప్రాణభయంలో ఉన్న కంసుడిని జుట్టు పట్టుకుని సింహాసనం మీది నుంచి కిందికి తోసి తలనరికి సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పుకుంటూ వెళితే శ్రీకృష్ణుడి పుట్టుక నుంచి అవతారం చాలించే వరకూ అడుగడునా కష్టాలే...అయినా ఏనాడూ కన్నయ్య ముఖంపై చిరునవ్వు చెరగలేదు..