Atla Tadde 2024 : ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ రోజు జరుపుకునే కర్వా చౌత్ కి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నోము చేసుకోవడం వల్ల అవివాహితులకు మంచి భర్త లభిస్తాడని...వివాహితుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని విశ్వాసం.  ఈ ఏడాది అక్టోబరు 19 శనివారం వచ్చింది అట్లతదియ. దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని, చంద్రోదయ ఉమా వ్రతం అని అంటారు.


వేకువజామునే నిద్రలేచి చద్ది (అన్నం , కూరలు, పప్పు, పచ్చడి, పొడి) తింటారు. ఆ తర్వాత ఇరుగు పొరుగు స్నేహితులతో కలసి అట్లతద్ది ఆరట్లోయ్, ముద్ద పప్పు మూడట్లోయ్ అంటూ ఆడిపాడతారు. పదకొండు తాంబూలాలు తీసుకుంటారు, పదకొండు ఉయ్యాలలు ఊగుతారు, పదకొండు రకాల ఫలాలు తింటారు. రోజంతా ఉపవాసం ఉండి.. సూర్యాస్తయమం తర్వాత గౌరీదేవికి, చంద్రుడికి పూజచేసి 11 అట్లు నైవేద్యం సమర్పించి.. ముత్తైదువలకు 11 అట్లు వాయనం ఇస్తారు. 


Also Read: కుజ దోషాన్ని తొలగించే కర్వా చౌత్ - ఈ ఏడాది ఎప్పుడొచ్చింది..పూజా విధానం ఏంటి!


పూజ అనంతరం ఈ కథ చదువుకుంటారు


అట్లతద్దికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం  ఓ రాజ కుమార్తె, మంత్రి కుమార్తె, పురోహితుడి కుమార్తె స్నేహంగా ఉండేవారు. అట్ల తదియ రోజు ముగ్గురూ కలసి నోము నోచుకోవాలని భావించారు. అత్యంత సున్నితంగా ఉండే రాకుమార్తె ఉపవాసం ఉండడంతో కళ్లు తిరిగి పడిపోయింది. చెల్లెలిని చూసి చలించిపోయిన సోదరులు.. ఓ మంట వేసి దూరం నుంచి అద్దంలో చూపించి అదే చంద్రబింబం అని నమ్మించి ఉపవాసం విరమించేలా చేశారు. సోదరుల మాటలు నమ్మేసిన రాకుమారి తినేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ముగ్గురు స్నహితులకు వివాహం జరిగింది. మంత్రి కుమార్తె, పురోహితుని కుమార్తెకు మంచి భర్తలు రాగా... రాకుమారికి ముసలి భర్త వచ్చాడు. మీతో పాటూ నోము నోచుకున్నా కన్నా మరి ఎందుకిలా జరిగిందని అడిగింది రాకుమారి. అప్పుడు ఆమె సోదరులు చేసిన పనిని వివరించారిద్దరు. బాధపడిన రాకుమారి ఆ తర్వాత వచ్చిన అట్లతదియ రోజు నియమాలు పాటిస్తూ  చంద్రోదయ ఉమా వ్రతం చేసింది. పూజ అనంతరం అక్షతలు తను వేసుకుని భర్తకు ఇచ్చింది..శాపవిమోచనం పొందినట్టు ఆ ముసలివాడు అందమైన రాకుమారుడిలా మారిపోయాడు. అందుకే అవివాహితులు అట్లతదియ నోము నోచుకుంటే ఉత్తముడైన భర్త లభిస్తాడని పురాణాల్లో ఉంది. 


పూజ పూర్తైన తర్వాత కొన్ని ప్రాంతాల్లో దండనాల నియమాలు పాటిస్తారు..


కొన్ని బియ్యం తీసుకోవాలి..
రెండు గుప్పిళ్లలోకి బియ్యం తీసుకుని ఓ పీటపై కానీ, పళ్లెంలో కానీ చేతులను క్రాస్ గా ఉంచి కిందకు విడవాలి. ఆ సమయంలో ఇది చదువుకోవాలి 
తల్లిదండనా..తండ్రి దండనా కలిగి ఉండాలి ( బియ్యం ఓసారి విడవాలి)
అత్త దండనా...మామ దండనా కలిగి ఉండాలి ( బియ్యాన్ని రెండోసారి విడవాలి)
పురుషుడి దండనా..పుత్రుడి దండనా కలిగి ఉండాలి
సర్గానికి వెళ్లినా సవతి పోరు వద్దు
మేడమీదకు వెళ్లినా మారడు తల్లి వద్దు
యమ దండనా..రాచ దండనా ఎన్నటికీ వద్దు


ఒక్కో మాట చెబుతూ బియ్యాన్ని వదలాలి..ఇలా మూడుసార్లు చెప్పాలి.. ఓసారి అయిన తర్వాత అవే బియ్యాన్ని మిగిలిన రెండుసార్లు వినియోగించవచ్చు. ఇంట్లో నలుగురు ఐదుగురు నోము నోచుకుంటే అవే బియ్యాన్ని మళ్లీ మళ్లీ వినియోగించవచ్చు. పూజ అనంతరం ఆ బియ్యాన్ని మర్నాడు పరమాన్నం చేసి స్వామి అమ్మవార్లకు నివేదిస్తారు. 


Also Read: ఇంట్లో భారీగా మార్పులొద్దు.. ఈ 6 పెయింటింగ్స్ పెట్టండి చాలు ఆదాయం, ఆనందం, మనశ్సాంతి!


అట్లతద్ది వెనుకున్న శాస్త్రీయ కోణం



  • బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదిస్తారు. 

  • వానాకాలం కావడంతో ఈ సీజన్లో లభించే ఉసిరి, గోంగూర తినడం ద్వారా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

  • ఈ సమయంలో తప్పనిసరిగా గోరింట పెట్టుకోవాలి అని చెబుతారు..తద్వారా శరీరంలో వేడి తగ్గుతుంది

  • ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తుంది

  • పచ్చని చెట్ల దగ్గర ఆడిపాడడం వల్ల స్వచ్ఛమైన గాలి శరీరానికి అందుతుంది

  • ఉపవాసం కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది