దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే


దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా  ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం ఎల్లప్పుడూ కూడా మట్టి ప్రమిదలో వెలిగించాలి. వీటిలో రకాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే కామాక్షి దీపం. కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీదేవి చిత్రం ఉంటుంది. అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అనికూడా అంటారు. దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది. 


Also Read: ఈ సారి రెండు శ్రావణమాసాలు, మరి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు!


కామాక్షీ దేవి ఎవరు


సర్వదేవతలకూ శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని పండితులు చెబుతారు. అందుకే అన్ని ఆలయాల కన్నా ముందుగా  కామాక్షీ దేవి ఆలయాన్ని తెరిచి రాత్రి అన్ని ఆలయాలు మూసేసిన తర్వాత తలుపులు వేస్తారు. అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది.  అన్ని గుళ్లు మూసేసిన తర్వాత  ఈ అమ్మవారు పవళింపుసేవ ఉంటుందని చెబుతారు. సర్వశక్తి సంపన్నురాలైన కామాక్షీదీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుందని చెబుతారు. 


అఖండ దీపంగా చాలామంది ఇదే వెలిగిస్తారు


చాలామంది ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడు అఖండ దీపం వెలిగిస్తారు. ఆ సమయంలో చాలామంది కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది. ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం మరియు పండితులు చెబుతున్నారు. సాధారణంగా దేవుడి ముందు దీపారాధన చేసినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టడం ఆచారం.  కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తి వేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. పౌర్ణమిరోజు ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచి శుభప్రదం అని విశ్వసిస్తారు. 


Also Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!


కామాక్షి దేవి దీపంగా దక్షిణాదిలోని తమిళనాడు వారు ప్రసిద్ధిగా ఈ ఆచారాన్ని పాటిస్తారు . ఇతర తెలుగు , కర్ణాటక రాష్ట్రాలలో ఈ దీపాన్ని లక్ష్మీ దీపంగా, గజలక్ష్మీ దీపంగా పిలుస్తూ ఉంటారు .  ఎలా పిలిచినా ఈ దీపం మాత్రం అనంతమైన జ్ఞానసిద్ధిని , ఐశ్వర్యాయాన్ని అనుగ్రహిస్తుందని విశ్వాసం . 


సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే” 


“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక  మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.