లోక పాలనకు, ధర్మ సంస్థాపనకు శ్రీ మహా విష్ణువు ఎన్నో అవతారాలెత్తాడు. అలాంటి వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణమూర్తి మరో అవతారమే హయగ్రీవుడు. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు.. బ్రహ్మదేవుడి గురిం చి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు అందర్నీ హింసించేవాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణువేడగా.... యోగ నిద్రలో  ఉన్న శ్రీ విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి చెప్పింది.


శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డంకింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపుతాడు. తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగరడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరై పోయిందట. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని.. శక్తి సామర్ధ్యాలను గుర్రం తల గల శ్రీ మహావిష్ణువుకి ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా … జ్ఞానప్రదాతగా పూజలు అందు కుంటున్నాడని పురాణాల్లో చెబుతారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో ఈ రోజున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వలన విద్య – విజ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.


” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “


Also Read: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!