Dussehra 2025: కాలం స్త్రీ పురుష రూపాత్మకం అని చెబుతారు. తెలుగు సంవత్సరాదిలో చైత్రమాసం మొదలు వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం...ఈ ఆరు నెలలు పురుష రూపాత్మకం. ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ ఆరు నెలలు స్త్రీ రూపాత్మకం. ఈ రెండో అర్థభాగంలో తొలి నెల అయిన ఆశ్వయుజం అమ్మవారి ఉపాసనకు చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు. అందుకే ఆశ్వయుజం ఆరంభంలో వచ్చే శరన్నవరాత్రులు అత్యంత పవర్ ఫుల్. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ రోజుకో అలంకారంలో దర్శనమిచ్చే శక్తి స్వరూపిణికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.
2025 లో శరన్నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబరు 2 విజయదశమితో ముగుస్తాయి. వాస్తవానికి నవరాత్రులు పూర్తయ్యాక పదో రోజు దశమి వేడుకలో ఉత్సవాలు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది తదియ తిథి రెండు రోజులు సూర్యోదయం సమయానికి ఉండడంతో పదకొండురోజుల పాటూ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అలంకారాలు ఇవే...
ఏ రోజు ఏ అలంకారం? ఇంట్లో పూజ చేసుకునేవారు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? సెప్టెంబర్ 22 మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం - పులిహోర నైవేద్యం
సెప్టెంబర్ 23 రెండో రోజు ఆశ్వయుజశుద్ధ విదియ
శ్రీ గాయత్రి దేవి అలకారం - కొబ్బరి అన్నం నివేదిస్తారు
సెప్టెంబర్ 24 మూడో రోజు ఆశ్వయుజశుద్ధ తదియ
శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం - పంచభక్షాలు నివేదించాలి
సెప్టెంబర్ 25 నాలుగో రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ
శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం - పాయసం, వడపప్పు, పానకం
సెప్టెంబర్ 26 ఐదో రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి
శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం - అమ్మవారికి కదంబం నివేదిస్తారు
సెప్టెంబర్ 27 ఆరో రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం - ఈ రోజు కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు
సెప్టెంబర్ 28 ఏడో రోజు ఆశ్వయుజ శుద్ధ షష్టి
శ్రీ మహా చండీదేవి అలంకారం - కట్టుపొంగలి సమర్పించాలి
సెప్టెంబర్ 29 ఎనిమిదోరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి
మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం - అమ్మవారికి దధ్యోజనం నైవేద్యం పెడతారు
సెప్టెంబర్ 30 తొమ్మిదోరోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి
శ్రీ దుర్గా దేవి అలంకారం ఈ రోజు దుర్గాదేవి చక్కెరపొంగలి నైవేద్యంగా పెడతారు
అక్టోబర్ 1 పదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి
శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం మహర్నవమి రోజు శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు
అక్టోబర్ 2 పదకొండో రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి , విజయదశమి
శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం - గారెలు,పాయసం, పులిహోర అన్నీ నైవేద్యం పెట్టొచ్చు
అలంకారం ఆధారంగా అయితే ఇవి నైవేద్యంగా సమర్పించాలని చెబుతారు. అయితే ఇవి మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి? లేదంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాలేం అన్నది లేదు. ఎవరి శక్తికి అనుగుణంగా వారు నైవేద్యం పెట్టొచ్చు. మీరు చేసే పూజలు, సమర్పించే నివేదన కన్నా మీలో ఉన్న నిశ్చలమైన భక్తి ప్రధానం.
అలంకారాలు కూడా ఆలయాన్ని బట్టి మార్పులుంటాయి..కొందరు ఈ అలంకాలను అనుసరిస్తే.. మరికొందరు నవదుర్గల అలంకారాలు అనుసరిస్తారు..