ఆంజనేయుడి  జన్మ తిథి చైత్రమాసంలోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అయితే పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం  చైత్ర పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటారని చెబుతారు. ఉత్తరాది ప్రాంతాలతో సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. .
 


Also Read: కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతోత్సవాలు, భారీగా తరలివస్తున్న భక్తులు


"కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి..
శ్లోకం: వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || 
ఈ శ్లోకం  ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. 


చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి కాదు విజయోత్సవమే-ఎందుకంటే
హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడితో యుద్ధానికి వారధి నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా  రాముడు ఎదురైన క్షణం నుంచి తిరిగి అయోధ్య చేరుకునే వరకూ శ్రీరామ విజయం వెనుక అడుగడుకునా భక్తుడు హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని పట్టాభిషేక ఘట్టం ముగిసినతర్వాత రాముడు ఇలా అనుకున్నాడట "  హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో పట్టాభిషిక్తుడను అయ్యాను,  ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే ఈ విజయం , ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే" అని... ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట రాముడు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు అప్పటి నుంచి ఈ రోజున హనుమాన్ విజయోత్సవంగా భావించి ఏటా చైత్రపూర్ణిమ రోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 
  
Also Read: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం సహా ఈ రోజు ప్రత్యేకత , చదువుకోవాల్సిన శ్లోకం


హనుమంతుని నైజం 
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.


చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి వరకు 40 రోజుల పాటు ప్రతి రోజు 1, 3, 5,11 ఇంకా వీలైతే 41 సార్లు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం.