Guru Purnima 2023: సప్త చిరంజీవుల్లో ఒకడైన వేద వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది గురువుగా కొలుస్తారు. వ్యాసుడి పుట్టిన రోజైన ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు.


Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!


మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు
అంతులేని ఆధ్యాత్మిక సంపద అందించిన వ్యాసుడు జన్మించింది ఓ మత్స్య కన్యకి. పడవనడుపుకునే దాశరాజు కుమార్తె పేరు మత్స్య గంధి.  ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. యుక్త వయస్సు వచ్చాక తండ్రికి సాయంగా  యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేది. ఒక రోజు వశిష్ట మహర్షి మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల్లో భాగంగా యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్య గంధి తండ్రి అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనం చేసేందుకు కూర్చుంటాడు. మహర్షిని ఆవతలి ఒడ్డుకి తీసుకెళ్లాలని కూతుర్ని పురమాయించాడు దాశరాజు. సరేనన్న మత్స్యగంధి  పరాశర మహర్షిని ఎక్కించుకుని ఆవలి ఒడ్డుకి తీసుకెళుతుంటుంది. ఆ సమయంలో మత్స్య గ్రంధిని చూసి పరాశమ మహర్షి మనసు చలించింది.తన మనసులో కోర్కెను ఆమెకు చెప్పాడు పరాశర మహర్షి. అంతటి మహర్షి అలా అడిగేసరికి మత్స్య గంధి తను ఏమనుకుందో చెబుతుంది.
మత్స్య గంధి:  ఇంతటి మహానుభావులు , కాలజ్ఞానులైన మీరు  ఇలా ఎలా ఆలోచిస్తారు. పైగా పగటి పూట కోరిక తీర్చుకోవడం సరికాదని మీకు తెలియదా
పరాశర మహర్షి:  అందుకు సమాధానంగా పడవ చుట్టూ ఓ మాయా తిమిరం ( చీకటిని) సృష్టించాడు.
మత్స్య గంధి:  మీ కోరిక తీరిస్తే నా కన్యత్వం భంగమవతుంది తిరిగి నా తండ్రికి ముఖం ఎలా చూపించాలి
పరాశర మహర్షి:  నాతో సంగమించిన తరువాత కూడా కన్యత్వం చెడదు అని చెప్పి ఏదైనా వరం కోరుకోమన్నాడు
మత్స్య గంధి: నా శరీరం నుంచి వస్తున్న ఈ మస్త్యగంధం( చేపలకంపు) నచ్చలేదు, దాన్నుంచి విముక్తి చేయండి మహర్షి
పరాశర మహర్షి: ఆ వరంతో పాటూ ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన ఓ యోజనదూరం వరకూ వ్యాప్తిచెందుతుందని వరమిస్తాడు. అప్పటి నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారిపోయింది.  అప్పుడు వారిద్దరి కలయికతో జన్మించిన పుత్రుడే వ్యాసుడు


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?


సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు
సూర్యసమాన తేజస్సుతో, సర్వ వేదజ్ఞానంతో జన్మించిన వ్యాసుడు తపస్సుకి వెళుతున్నా అని తల్లితో చెబుతాడు. అయితే ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. చిన్నప్పుడే ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడిని పిలుస్తారు. మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి భారతకథలో భాగమై ఉన్నాడు. అయినప్పటికీ కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు. 


భరత వంశాన్ని నిలిపినది వ్యాసుడే
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత యోజనగంధి అయిన సత్యవతి…భీష్ముడి తండ్రి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. సత్యవతి తండ్రి దాశరాజు షరతు ప్రకారం భీష్ముడు బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు, విచిత్రవీర్యుడు అకాలమరణం చెందుతారు. ఇక భరతవంశాన్ని నిలిపేందుకు సత్యవతి తన పుత్రుడైన వ్యాసుడిని స్మరిస్తుంది. వ్యాసుడి ద్వారా అంబికకు దృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాశీకి విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.  ఆతర్వాత కూడా భారతంలో ప్రతి మలుపులోనూ వ్యాసుడు ఉంటాడు.


వ్యాసుడు జన్మించిన రోజే గురు పూర్ణిమ
మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి అందించారు. వేదాలను నాలుగు బాగాలుగా చేశాడు కాబట్టే వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసుని పుట్టిన రోజును గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. కాబట్టి దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.