AP Dharmika Parishat :  ఆంధ్రప్రదేశ్‌లో ఇక ఏటా రూ. 25 లక్షలకు పైబడి కోటి రూపాయలకు తక్కువ వార్షికాదాయం వచ్చే ఆలయాలకు ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో పాలక మండళ్ల నియామకం జరుగుతుంది. ఈ మేరకు ధార్మిక పరిషత్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  దేవదాయ శాఖ పరిధిలో ఉండే అలయాలు, సత్రాల కార్యకలాపాలపై తీసుకొనే విధాన పరమైన నిర్ణయాల్లో  పరిషత్‌ కీలకంగా వ్యవహరిస్తుంది.   వందేళ్లు దాటిన ఆలయాల పునర్నిర్మాణానికి ముందుగా పరిషత్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.  హిందూ ధార్మిక పరమైన కార్యక్రమాల నిర్వహణలో ధార్మిక పరిషత్‌తో చర్చించే నిర్ణయాలు జరుగుతాయి.   నిబంధనల ప్రకారం ధార్మిక పరిషత్‌ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అవసరమైతే ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభఉత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 


ఇప్పటి వరకూ ఒక్క సారే ధార్మిక పరిషత్ ఏర్పాటు 
 
ఉమ్మడి ఏపీలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటి సారిగా ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేశారు.  అప్పుడు ఏర్పడిన పరిషత్‌ పదవీకాలం 2012లో ముగిసింది.  2014లో మరోసారి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ, అది బాధ్యతలు చేపట్టక ముందే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పరిషత్‌ ఏర్పాటుకు ముందే రద్దయింది.  తిరిగి పదేళ్ల తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. పరిషత్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుంది. 


దేవాదాయ శాఖ కీలక వ్యవహారాలన్నీ ధార్మిక పరిషత్ ద్వారానే 
 
ధార్మిక పరిషత్‌లో దేవదాయ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవో తో పాటు మరో పదిహేడు మంది ఉంటారు. దేవదాయ శాఖ పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో ధార్మిక పరిషత్‌ కు విశేషమైన అధికారాలు ఉంటాయి. శాఖ పరిధిలోని రూ.25 లక్షల నుంచి రూ. కోటి లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలు, అన్ని రకాల మఠాల పాలన, ధార్మిక వ్యవహారాలు పూర్తి పరిషత్‌ ఆధీనంలో కొనసాగాలి. రాష్ట్రంలో చిన్నా పెద్దవి కలిపి మొత్తం 128 మఠాలు ఉన్నాయి. మంత్రాలయం, హథీరాంజీ మఠం వంటివి ఈ కేటగిరిలోకే వస్తాయి. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయడం లేదని కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అవి విచారణలో ఉన్న సమయంలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 


గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్న దేవాదాయ మంత్రి 


సీఎం  ఆదేశాలతో  ధార్మిక  పరిషత్ ఏర్పాటు  జరిగిందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు.  మూడేళ్లకు  ఒక సారి  ధార్మిక  పరిషత్   ఏర్పాటు  జరగాల్సి ఉందన్నారు. కానీ   టీడీపీ  ప్రభుత్వం ఏర్పాటు  చేయలేకపోయింది...దీనికి వాళ్ళే  సమాధానం  చెప్పాలన్నారు.  ప్రస్తుతం  ఏర్పాటు  చేస్తున్న  ధార్మిక  పరిషత్  లో  21 మంది  సభ్యులు ఉంటారు ..25 లక్షల  నుంచి  కోటి  రూపాయల  ట్రస్ట్  బోర్డ్  లన్ని    ధార్మిక  పరిషత్   నుంచే  ఏర్పాటు చెయ్యాల్సి ఉందన్నారు.  మఠాధిపతులు  పై  ఏదైనా  చర్యలు  తీస్కొవాలి   అంటే  ధార్మిక  పరిషథ్  కు అధికారాలు ఉంటాయన్నారు.  లీజ్  కు సంబంధించి  ఏదైనా  చర్యల ను  తీసుకోవాలి  అంటే  ధార్మిక  పరిషత్తు  తోనే  సాధ్యమని మంత్రి తెలిపారు.