Ganesh Immersion 2022:  బుధుడు అధిపతియైన హస్త నక్షత్రం వినాయకుడిది. సాధారణంగా బుధ గ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టమైనట్టే  వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. వినాయక పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేంటంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. నవరాత్రులు పూజలందించిన తర్వాత మేళతాళాలతో గంగమ్మ ఒడికి గణేషుడిని చేరుస్తారు. దీని వెనక ఎంత వేదాంత రహస్యం ఉందో తెలుసా…
Also Read: పార్వతీదేవి వినాయకుడిని దేనితో తయారు చేసింది, ఏనుగు ముఖం పెట్టకముందు వినాయకుడి రూపం ఇదే!


మృత్తికే పరబ్రహ్మం
మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజిస్తారు. పైగా మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా- ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వానికి ఏకైక నిదర్శనం భూమి/మట్టి. పంచ భూతాత్మకం అయిన ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలు అనుభవించినా ఎంత విలాసంగా ఉన్నా చివరికి కలిసేది మట్టిలోనే. వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. వానాకాలంలో చెరువులు పూర్తిగా నిండి అలుగు పారకుండా ఉండాలంటే పూడిక తీయాలి. ఆ పనిలో భాగమే చెరువుల్లో బంకమట్టి తవ్వితీసి వినాయక విగ్రహాలు తయారు చేయాలన్న నిబంధన పెట్టారు.
Also Read:  బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!


పత్రిల ఉండే ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి
వినాయకుడిని 21 పత్రితో పూజిస్తా. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే  పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్య పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. అందుకే మట్టి వినాయకుడిని వినియోగించాలని చెబుతారు..


వినాయకుడిని నిమజ్జనం చేయకపోతే!
సాధారణంగా వినాయకచవితి రోజు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి వీలుని బట్టి 3,5,7,9,11,21 రోజుల పాటూ పూజలు చేసి గంగమ్మ ఒడికి చేరుస్తారు. మండపాల్లో విగ్రహాల సంగతి సరేకానీ..కొందరు ఇళ్లలో వినాయక ప్రతిమకు ఉద్వాసన చెప్పేసి పక్కనపెట్టేస్తారు నిమజ్జనం చేయరు. అయితే ఇలా ఉంచడం వల్ల ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదుకానీ.. విగ్రహాలు ఇంట్లో ఉంటే దాని పరిమాణానికి తగినంత నైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. పైగా గణనాథుడు అంటే గణాలకు అధిపతి..అంటే ఆయన పరివారం చాలా పెద్దది. అలాంటి వినాయకుడికి నిత్యం చిన్న బెల్లం ముక్క, చిటికెడు పంచదార నివేదించి సంతృప్తి పరచలేరు. అందుకే వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పండితులు చెబుతారు.