Srivari Salakatla Brahmotsavam: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలను ముస్తాబు చేసేందుకు టీటీడీ సన్నాహాలు ప్రారంభించింది . నిర్దేశిత సమయంలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు ఈవో ఆదేశించారు. తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న తరుణంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల తేదీలు
- 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.- 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.- 24-09-2025 ధ్వజారోహణం.- 28-09-2025 గరుడ వాహనం.- 01-10-2025 రథోత్సవం.- 02-10-2025 చక్రస్నానం.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేస్తారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. భక్తుల అవసరాలకనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టనున్నారు. గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమించుకుంటారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయనున్నారు. 27-09-2025 రాత్రి 9 నుండి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని సంబంధిత విభాగానికి ఆదేశాలిచ్చారు.