YS Sharmila Political Career : వైఎస్సాఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ( Aicc) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)సమక్షంలో ఢిల్లీలో (Delhi )కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దీంతో తన పార్టీని...కాంగ్రెస్ లో విలీనం చేసినట్లయింది. తెలంగాణ కోడలినంటూ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పార్టీని ప్రకటించిన షర్మిల, ఇపుడు ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా రాజకీయాలు చేయబోతున్నారు. సొంత పార్టీ ఏర్పాటు నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం దాకా షర్మిల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.



కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు మొదలుపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి...చివరి దాకా ఆ పార్టీలోనే కొనసాగారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ కు దూరమైన షర్మిల...చివరికి కాంగ్రెస్ గూటికే చేరారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా పని చేస్తానని అంటున్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని తన నివాసంలో పార్టీ పేరును వైఎస్సార్టీపీగా ప్రకటించారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని,  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడు అన్నారు. తాను తెలంగాణ కోడలిని అని, తన భర్త అనిల్, అత్తమామలు తెలంగాణకు చెందినవారేనని స్పష్టం చేశారు. మెట్టినింట్లో తనకు హక్కులు ఉండవా అని ప్రశ్నించిన షర్మిల...ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణను చుట్టేశారు. తెలంగాణలో 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. 3,800 కిలో మీటర్లు నడిచిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. 


119 అసెంబ్లీలో పోటీ చేస్తానని ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సొంతంగానే 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అదే డైలాగ్ వదిలారు. నామినేషన్ల పర్వం మొదలయ్యే నాటికి సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకూడదన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు షర్మిల. ఎన్నికల ముందు కేసీఆర్ బై బై అంటూ పంచ్ డైలాగ్ లు వదిలారు. సమయం వచ్చినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. పాదయాత్రకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఒకానొక సమయంలో పోలీసులపైనా చేయి చేసుకున్నారు. స్థానికురాలు కాదని విమర్శలు వచ్చినా...వాటిని పట్టించుకోకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించారు.


తెలంగాణ యాక్టివ్ కావాలని అనుకున్నా...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చేరాలని అనుకున్నప్పటికీ...ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు షర్మిల రాకను వ్యతిరేకించారు. ఆమె వస్తే పార్టీకి నష్టమేనని, ఆమె స్థానికతను తెలంగాణ ప్రజలు, పార్టీలు అస్త్రంగా మార్చుకుంటాయని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు నివేదిక ఇచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో చేరికకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తన రూట్ మార్చారు షర్మిల. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ తరపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగడంతో వెనక్కి తగ్గారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. దీంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చాయంటూ ప్రచారం జరిగింది. 



పీసీసీ బాధ్యతలుఅప్పగించే ఛాన్స్ ?
షర్మిల రాకను స్వాగతించిన కాంగ్రెస్ హైకమాండ్...ఏపీ బాధ్యతలు చేపట్టాలని కండిషన్లు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని, తెలంగాణ వదిలేసి ఏపీ బాధ్యతలు తీసుకుంటే పార్టీలోకి చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. దీనికి ఓకే చెప్పిన వైఎస్ షర్మిల, వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఏపీలో సరైన నేతలు లేకపోవడం, ఉన్న కాంగ్రెస్ నేతలంతా అన్న జగన్ వెంట నడిచారు. హస్తం పార్టీకి జవసత్వాలు నింపేందుకు, పార్టీ పునర్ వైభవం తీసుకొచ్చేందుకు షర్మిల పని చేయనున్నారు. ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపి,  ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. 



జగన్ ను ఢీ కొట్టబోతున్న షర్మిల
ఏపీ ముఖ్యమంత్రి, అన్న జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేయనున్నారు. సొంత అన్నయ్య అయినప్పటికీ...ఆస్తుల వ్యవహారంలో ఇద్దరికి గొడవలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఏపీలో పాదయాత్ర చేసి...పార్టీని నిలబెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పట్టించుకోకపోవడంతో సొంత కుంపటి పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్న షర్మిల..తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే ఢీ కొట్టబోతున్నారు.