Madakasira MLA M Thippeswamy Hot Comments: దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు తప్పడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. దళితులపై అవమానాలు సహజమే అంటూ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి తన ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిర నియోజకవర్గంలో వైసిపి నేతలతో సభ కార్యక్రమాన్ని పార్టీ పరిశీలకుడు నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అయిన నాకు సరైన సమాచారం ఇవ్వలేదని.. తనకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ నియోజకవర్గ పరిశీలకుడు అశోక్ కుమార్ కు ఎమ్మెల్యే తిప్పేస్వామి లేఖ రాశారు. 


రాకూడదనే హడావిడి మీటింగ్‌


లేఖలో ఏముంది అంటే.... నేను విజయవాడలో ఉన్నానని తెలిసి కూడా కొన్ని గంటల ముందు మాత్రమే సమావేశం ఉందని తెలియజేశారు. నేను మీటింగ్‌కి రాకూడదని దురుద్దేశంతోనే సమావేశానికి కొన్ని గంటల ముందు మాత్రమే పిలిచారని భావిస్తున్న. మడకశిర నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నేను లేకుండా సమావేశం జరపటం ఎంతవరకు కరెక్ట్. 


దళితులకు అవమానం పార్టీకి నష్టం


దళిత వర్గానికి ఎలాంటి సందేశాన్ని పంపించాలని అనుకున్నారో చెప్పండి.  ఇది దళితులని అవమానించడం కాదా..! ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా.. మీటింగ్‌లో వైసిపి అసమ్మతి నేతల మధ్య కార్యకర్తల సమావేశం జరపటం సరికాదు. వైసిపి అసమ్మతి నేతలు ఎమ్మెల్యే అయిన  నన్ను తిడుతుంటే వారించకపోగా నవ్వుతూ వారి పక్కన కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్. దళితలైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానం భరించడం సహజమే అని ఊరికే ఉన్నాను. 


హాజరైన వాళ్లంతా వైసీపీ కాదు


ఈ మీటింగ్ కు 90% వైసిపి ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరు కాలేదు. ఈ విషయం మీకు ఎంతవరకు తెలుసు. వైసీపీకి ఇది ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా... మీటింగ్‌ పూర్తిగా ఫెయిల్యూర్‌ అని గుర్తించారు. 


ఏం చేసినా జగన్‌ను సీఎంగా చూడాలి


కేవలం ఆరేడుగురు  అసమ్మతి నాయకుల మాట విని ఈ మీటింగ్ పెట్టడం పార్టీకి నష్టం చేయదా? ఇది వైసీపీ కేడర్‌కు నచ్చలేదు. ఇలా వచ్చిన వాళ్లు ఏ ఊరికి చెందిన వాళ్లో... వాళ్లంతా ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు కాదని గుర్తించాలన్నారు. దళితుడైన నన్ను అవమానించిన పర్వాలేదు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి గెలిపించడానికి సహకరించాలని కోరుతున్నా.... అంటూ ఎమ్మెల్యే తిప్పేస్వామి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.