YSRCP falls into TDP Christian trap:   శాసనమండలిలో జరిగిన పరిణామాల్లో  వైసీపీ చాలా పక్కాగా టీడీపీలో  ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. కల్తీ నెయ్యి అంశంపై చర్చలో  టీడీపీ సభ్యులు వ్యూహాత్మకంగా జగన్ మతం ప్రస్తావన తెచ్చారు. అచ్చెన్నాయుడు శాసనమండలి చైర్మన్ ను ఇంక్లూడ్ చేస్తూ మీరు..మీ నాయకుడు క్రిస్టియన్లు అని అన్నారు. దాంతో మండలి చైర్మన్ ఉలిక్కి పడ్డారు. తాను హిందువునేనని చెప్పారు. పేరుతో మోషేన్ అని ఉంటే మతం మార్చుకున్నట్లు కాదన్నారు. అయితే జగన్ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. దాంతో అచ్చెన్నాయుడు.. తాను జగన్ క్రిస్టియన్ అనే మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.  

Continues below advertisement

జగన్ మత ప్రస్తావనతో గందరగోళంలో వైసీపీ సభ్యులు                

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చ కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. అధికార తెలుగుదేశం పార్టీ వేసిన రాజకీయ వ్యూహంలో వైసీపీ సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు. తిరుమల పవిత్రత గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, మత ప్రస్తావన తీసుకురావడం ద్వారా వైసీపీని డిఫెన్స్‌లో పడేయాలన్న టీడీపీ వ్యూహం పక్కాగా అమలు జరిగింది. సభలో లేని జగన్ మతాన్ని ప్రస్తావిస్తూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించే క్రమంలో వైసీపీ సభ్యులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.  

Continues below advertisement

క్రిస్టియన్ పార్టీగా ముద్రవేసే ట్రాప్            

తిరుమల లడ్డూ వంటి అత్యంత సున్నితమైన హిం దూ సెంటిమెంట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, వైసీపీని ఒక నిర్దిష్ట మతానికి చెందిన పార్టీగా చిత్రించాలనేది టీడీపీ ప్లాన్. అచ్చెన్నాయుడు నేరుగా జగన్ మతాన్ని ప్రస్తావించినా, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వైసీపీ సభ్యులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజల్లోకి  వైసీపీ  అధినేత ఒక క్రిస్టియన్ అనే ముద్రను బలంగా తీసుకెళ్లే అవకాశం టీడీపీకి చిక్కినట్లయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీకి ఒక సీనియర్ దిశానిర్దేశకుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ   తన చాకచక్యంతో సభను దారిలోకి తెచ్చేవారు. కానీ ఆయన అనారోగ్యంతో సభకు రాకపోవడంతో, టీడీపీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు వైసీపీ సభ్యులు తడబడ్డారు.  

వాయిదా పడినా ఇమేజ్ డ్యామేజ్ 

పరిస్థితి విషమిస్తోందని, మతపరమైన చర్చ తమకు నష్టం చేకూరుస్తుందని గ్రహించిన వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైసీపీ, చివరకు తమ మత గుర్తింపును కాపాడుకోవాల్సిన ఆత్మరక్షణ స్థితికి పడిపోయింది.  మండలిలో జరిగిన ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. కేవలం కల్తీ నెయ్యి చర్చకు మాత్రమే పరిమితం కాకుండా, దీన్ని ఒక మతపరమైన కోణంలోకి మళ్లించడంలో టీడీపీ విజయం సాధించింది. చట్టసభ రికార్డుల్లోనే జగన్  మతం గురించి చర్చ రావడం, దాన్ని కౌంటర్ చేయలేకపోవడం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరమైన అంశంగానే భావిస్తున్నారు.