ముందు నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారట.. అయినా కోటరెడ్డి వ్యవహరంలో సీఎం నమ్మకంగా వ్యవహరించారు. నిఘా పెట్టాలని అధికారులు సైతం చెప్పారు కానీ సీఎం జగన్ వద్దనేశారని టాక్. మరి ఇప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.


కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి విషయంలో మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. సీనియర్‌లు ఆయనతో కలిసి పని చేసిన వారు చేస్తున్న ప్రధాన ఆరోపణ  ఇది. ముఖ్యంగా క్యాబినెట్ కూర్పు తర్వాత కోటంరెడ్డిలో అసహనం పెరిగిపోయిందంటున్నారు. అప్పటి నుంచి కోటం రెడ్డి వ్యవహర శైలిలో కూడా మార్పులను గమనించామని సొంత పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు. తన నియోజకవర్గంలో పనులు చేయటం లేదని కోటం రెడ్డిని అధికారులపై నిరసన వ్యక్తం చేయటం, ఏకంగా డ్రైనేజిలోకి దిగి అక్కడే కుర్చొని అధికారులపై ఆరోపణలు చేయటం వంటి ఘటనలు  గుర్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వాన్ని ఇరుకున పడిందన్నారు. అయితే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారనే అనుమానాలు పార్టీ నేతలు నుంచి వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న శాసన సభ్యులు తన నియోజకవర్గంలో జరగాల్సిన పనులపై ఉన్నతాధికారులతో సంప్రదించి పని కానిస్తారు. తనకు కావాల్సిన విధంగా పని చేయించుకునేందుకు పూర్తిగా అవకాశం ఉన్నా కోటం రెడ్డి ఎందుకు బాహాటంగా నిరసన వ్యక్తం చేశారన్నది చర్చనీయాశమైంది. 


శవం పై పార్టి జెండా జగన్ కప్పాలన్నారు...


జగన్ కు అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తుల్లో కోటంరెడ్డి ఒకరు. అయితే ఆయనే ఇలా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించటం కలకం రేపింది. తాను చనిపోతే జగన్ వచ్చి చూడాలని కోటం రెడ్డి గతంలో ఒక సభలో వ్యాఖ్యానించారు. అలాంటి మాటలు మాట్లాడిన కోటం రెడ్డి ఇప్పుడు ఏకంగా జగన్‌ ప్రభుత్వాన్ని, పార్టీలో ఉండే కొందరు కీలక వ్యక్తులను టార్గెట్ చేసి, విమర్శలు చేయటం ఏంటనే ప్రశ్న పార్టీ నేతలను ఇప్పటికీ తొలిచేస్తోంది.


అనుమానం అలా మెదలైందా?


జగన్‌కు అత్యంత దగ్గరగా ఉండే ఎమ్మెల్యేల్లో కోటం రెడ్డి ఒకరు. అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీరు అనుమానాస్పదంగా ఉందని... ఆయనపై నిఘా పెట్టాలని జిల్లా స్థాయి అధికారులు నుంచి వచ్చిందట. ఈ సమాచారాన్ని సీఎంవో అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే జగన్ చాలా సీరియస్ అయ్యారట. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తను నమ్మిన వ్యక్తని జగన్ అన్నారటని టాక్. నిఘా అవసరం లేదన్నారని సీఎంవో నుంచి వస్తున్న సమాచారం. దీంతో అధికారులు రెండు,మూడు సార్లు నిఘా పెట్టేందుకు జగన్ అనుమతి కోరినా సున్నితంగానే తిరస్కరించారట. ఈ విషయాలను పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. జగన్ వద్ద నమ్మకంగా ఉంటూనే కేవలం మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


ఇంకా ఎవరెరెవరు వస్తారో.....


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. దీంతో పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేయటానికి రెడీ అవుతున్నారు. అధికార పార్టీ కావటంతో అధినేతపై వ్యతిరేకత ఉన్న నాయకులు ఎవరెవరు అన్నది ప్రస్తుతానికి చర్చనీయాశంగా మారింది. ఇంకెంత మంది బయటకు వచ్చి తమ అసంతృప్తి వెళ్ళగక్కుతారోనని పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అయితే సీటు దక్కదని నిర్దారణకు వచ్చిన నేతలు, పదవులు రావని నిర్దారించుకున్న నేతలు ఎన్నికల ముందు జంపింగ్ చేయటం కామన్ అనే కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.